బనకచర్ల హీట్! తెలంగాణ, ఏపీ మధ్య ముదురుతున్న వివాదం.. ఇవాళ (జూన్ 18) అఖిలపక్ష ఎంపీలతో భేటీ

బనకచర్ల హీట్! తెలంగాణ, ఏపీ మధ్య ముదురుతున్న వివాదం.. ఇవాళ (జూన్ 18) అఖిలపక్ష ఎంపీలతో భేటీ
  • హాజరుకానున్న సీఎం రేవంత్​..బీజేపీ ఎంపీలకూ పిలుపు
  • కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సలహాలు తీసుకోనున్న రాష్ట్ర సర్కారు
  • బీజేపీ ఎంపీల హాజరుపై అనుమానాలు 
  • ఆనాడు ఏపీకి సహకరించిన బీఆర్​ఎస్​.. ఇప్పుడు రివర్స్ గేర్​
  • రాజకీయ ప్రయోజనాలతోనే అడ్డుకుంటున్నారని ఏపీ ఎదురుదాడి
  • ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకునేందుకు వేగంగా అడుగులు

హైదరాబాద్​, వెలుగు: ఏపీ చేపడుతున్న గోదావరి – బనకచర్ల (జీబీ) లింక్​ ప్రాజెక్ట్​ రాజకీయాలను హీటెక్కిస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేస్తున్నది. ప్రాజెక్టుకు కేంద్రం నుంచి  పర్మిషన్లు తెచ్చుకునేందుకు ఆంధప్రదేశ్​ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుండగా.. దాన్ని నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. 

పేరుకు గోదావరి మిగులు జలాలను తీసుకెళ్తామని ఏపీ చెప్తున్నా.. అది కృష్ణా నీటి దోపిడీకేనని మన నీటిరంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్​ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి సమర్పించిన ఏపీ.. పర్యావరణ అనుమతులకు సంబంధించి టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ (టీవోఆర్​) ఆమోదానికీ ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి సీఎం రేవంత్​ రెడ్డి, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి  వరుస లేఖలు రాశారు. 

ఇదే అంశంపై చర్చించి కేంద్రానికి నివేదించేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో బుధవారం (june 18) మన రాష్ట్ర ప్రభుత్వం సమావేశం కానుంది. ఇదే సమయంలో తెలంగాణపై ఏపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. రాజకీయ ప్రయోజనాల కోసం బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణలోని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని  ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం అమరావతిలో ఆరోపించారు. బీఆర్ఎస్​ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

 ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల అంశం ఎలాంటి టర్న్​ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తుందా.. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల స్టాండ్​ ఎలా ఉండబోతుందన్నదీ చర్చనీయాంశంగా మారింది.


ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో.. ఇక రాజకీయంగానే తేల్చుకోవాలని తెలంగాణ సర్కారు డిసైడ్​ అయింది. అందులో భాగంగానే అఖిలపక్ష ఎం పీలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుం ది. బుధవారం సాయంత్రం సెక్రటేరియెట్​లో సమా వేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేర కు మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీల సలహాలు, సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఈ సమావేశానికి సీఎం రేవంత్​ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​ అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ ఇప్పటికే కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశామని, స్వయంగా కలిసి విజ్ఞప్తి కూడా చేశామని మంత్రి ఉత్తమ్​ పేర్కొన్నారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుతో రాష్ట్ర నీటి హక్కులకు తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా, ప్రాజెక్టుపై ఎంపీలకు మంత్రి ఉత్తమ్​ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇవ్వనున్నారు. గోదావరి మిగులు జలాలను మాత్రమే తరలిస్తామని ఏపీ చెప్తున్నప్పటికీ ఆ పేరుతో సాగర్​ నుంచి కృష్ణా నీటిని దోచుకెళ్లే కుట్రకు పాల్పడుతున్నదని ఉత్తమ్​ఇప్పటికే ఆరోపించారు. ఇదే విషయాన్ని పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ద్వారా ఎంపీలకు స్పష్టంచేయనున్నట్లు తెలుస్తున్నది. 

బీజేపీ స్టాండ్​ ఏంటో..?

బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటివరకు కాంగ్రెస్​ సర్కారు ఒంటరిగానే పోరాడుతున్నది. బీజేపీ మాత్రం మారుమాటైనా మాట్లాడడం లేదు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలపై మౌనం వహిస్తున్నది. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ.. బనకచర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేయలేదు. 

పైగా సీఎం రేవంత్​రెడ్డి కేంద్రంతో మాట్లాడాలంటూ బీజేపీ స్టేట్​ చీఫ్,  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఓ ప్రెస్​మీట్​లో అనడం గమనార్హం. దీంతో బనకచర్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది..తమకేం పట్టింపు లేదు అనే రీతిలో బీజేపీ నేతల వ్యవహార శైలి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంపీల సమావేశానికి అసలు బీజేపీ ఎంపీలు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.  

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ వితండవాదం

మిగులు జలాలే లేవని సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ), నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) స్వయంగా కేంద్ర జలశక్తి శాఖకు సమాచారం ఇచ్చాయి. కానీ, ఇప్పటికీ ఏపీ మాత్రం  బుకాయింపులకు దిగుతున్నది. తాము కేవలం మిగులు జలాల ఆధారంగానే ప్రాజెక్టును చేపడుతున్నామని అంటున్నది. గోదావరిలో కనీసం వంద రోజులు వరద ఉంటుందని, ఆ రోజుల్లోనే రోజూ 2 టీఎంసీల చొప్పున వరద జలాలను బనకచర్లకు తరలిస్తామని చెప్తున్నది. 

తాజాగా ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. బనకచర్ల వల్ల ఎగువ రాష్ట్రాలకు అసలు ఎలాంటి సమస్యలు రావని, వారి నీళ్లను వాడుకోబోమని చెప్పారు. కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. తాము అన్ని నిబంధనలకు తగ్గట్టుగానే ప్రాజెక్టును చేపడుతున్నామని, అనుమతులు తీసుకున్నాకే ముందుకు వెళ్తామని చెప్పారు. 

తెలంగాణలో కేసీఆర్​ హయాంలో అనుమతులు రాకముందే కాళేశ్వరం, సీతారామసాగర్​, పాలమూరు – రంగారెడ్డి, సమ్మక్కసాగర్​ బ్యారేజీలను నిర్మించారని వ్యాఖ్యానించారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతానికి.. గోదావరిలో వృథాగా సముద్రంలో కలిసే నీటినే తీసుకెళ్తామంటే తెలంగాణ ఎందుకు అడ్డుకుంటున్నదంటూ ప్రశ్నించారు. 

బీఆర్​ఎస్​.. అప్పుడట్ల.. ఇప్పుడిట్ల

బనకచర్ల ప్రాజెక్టును ఇప్పుడు బీఆర్​ఎస్​ పార్టీ వ్యతిరేకిస్తున్నా.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పు డు రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని స్వయంగా నాడు సీఎం హోదాలో కేసీఆర్ ఆనాటి ఏపీ సీఎం జగన్​కు హామీ ఇచ్చారు. ప్రగతిభవన్​లో మీటింగ్​ ఏర్పాటు చేసి.. రాయల సీమకు నీటి తరలింపుపై కేసీఆర్​ సానుకూలంగా స్పందించారు. కృష్ణా నుంచి నీటిని తరలిం చుకునే బదులు.. నీటి లభ్యత ఎక్కువుండే గోదావరి నుంచి డైవర్ట్​ చేసుకుంటే బాగుంటుంద ని నాడు జగన్​కు ఉచిత సలహాలూ ఇచ్చారు. నగరిలోని అప్పటి మంత్రి రోజా ఇంటికెళ్లి కూడా ఇదే మాట చెప్పారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ మాటలు  మరిచి.. బనకచర్లపై రాష్ట్ర సర్కారు పోరాడడం లేదని బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడుతున్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్​ కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్​ రావు తాజాగా పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​లోనూ ఇవే ఆరోపణలు చేశారు. ఆనాడు ఏపీ ప్రాజెక్టులకు సహక రించి.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారంటూ బీఆర్​ఎస్​పై స్వయంగా ఏపీ మంత్రి రామా నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, బీఆర్​ఎస్​ తరఫున లోక్​సభ ఎంపీలు లేరు. 

అయితే, నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్​ రావు, కేఆర్​ సురేశ్​ రెడ్డి బీఆర్​ఎస్​ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీఆర్​ఎస్​ డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో.. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి వారు హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.