ముంబై : అన్లాక్తో పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో అక్టోబర్ నెలలో నియామకాలు ఊపందుకున్నాయి. అంతకు ముందు నెల సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో కొత్త హైరింగ్ చురుగ్గా సాగిందని నౌకరి జాబ్స్ సీక్ ఇండెక్స్ అక్టోబర్ రిపోర్టు వెల్లడించింది. అయితే, ఏడాది కిందటితో పోలిస్తే మాత్రం హైరింగ్ 17 శాతం తక్కువేనని పేర్కొంది. తన జాబ్స్ పోర్టల్ నౌకరి.కామ్లో పోస్టయ్యే లిస్టింగ్స్, అపాయింట్మెంట్స్ ప్రాతిపదికన ప్రతి నెలా నౌకరి ఈ రిపోర్టు విడుదల చేస్తోంది. ఐటీ–సాఫ్ట్వేర్, సర్వీసెస్ రంగాలలో జాబ్స్ 7 శాతం పెరిగాయని చెబుతూ, కరోనా మహమ్మారితో డిజిటల్ వైపు అడుగులు వేస్తుండటమే ఇందుకు కారణమని వివరించింది. లాక్డౌన్స్తో సతమతమవుతున్న హాస్పిటాలిటీ, ట్రావెల్ సెక్టార్లలో హైరింగ్ 33 శాతం పెరగ్గా, రిటెయిల్ సెక్టార్లో 12 శాతం పెరిగినట్లు నౌకరి పేర్కొంది. పండగల సీజన్ రావడంతో ఈ సెక్టార్లలో యాక్టివిటీ మెరుగైందని తెలిపింది. మార్కెట్లో వినియోగం (కన్సంప్షన్) పెరుగుతుండటంతో కన్సూమర్ డ్యూరబుల్స్ రంగంలోనూ నియామకాలు జోరందుకుంటున్నట్లు నౌకరి వెల్లడించింది. ఈ రంగంలో ఉద్యోగాలు నాలుగు శాతం పెరిగాయని పేర్కొంది. అడ్వర్టయిజింగ్, పబ్లిక్ రిలేషన్స్ సెక్టార్లో జాబ్స్ 14 శాతం ఎగిశాయని వివరించింది. ఇదే సమయంలో, బీపీఓ రంగంలో జాబ్స్ 5 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగంలో 4 శాతం తగ్గాయని వెల్లడించింది. ఎడ్యుకేషన్, టీచింగ్, ఆటో, ఆటో యాన్సిలరీ సెక్టార్లలో నియామకాలు అంతకు ముందు నెలలాగే ఉన్నాయని పేర్కొంది.
టికెటింగ్, ట్రావెల్, హాస్పిటాలిటీ సెక్టార్లలో జాబ్స్ పెరిగాయని, అక్టోబర్లో ఈ రంగాలలో జాబ్స్ 35 శాతం, 28 శాతం చొప్పున పెరిగాయని తెలిపింది. ప్రొఫెషనల్స్ హైరింగ్ కూడా పెరుగుతోందని, ముఖ్యంగా టీవీ, ఫిల్మ్ ప్రొడక్షన్ సెక్టార్లో 17 శాతం, వెబ్–గ్రాఫిక్ డిజైనర్స్ సెక్టార్లో 17 శాతం, ఫైనాన్స్లో 7 శాతం, సేల్స్–బిజినెస్ డెవలప్మెంట్లో 6 శాతం చొప్పున నియామకాలు ఎక్కువయ్యాయని పేర్కొంది. రికవరీలో బెంగళూరు 8 శాతంతో ముందుండగా, 6 శాతంతో చెన్నై రెండో ప్లేస్లో ఉన్నట్లు నౌకరి తెలిపింది. కోచ్చి 9 శాతం, కోయంబత్తూర్ 5 శాతంతో టైర్ 2 సిటీల్లో ముందున్నాయని పేర్కొంది. సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో కోల్కత్తాలో 4 శాతం, అహ్మదాబాద్లో 6 శాతం నియామకాలు తగ్గాయని ఈ రిపోర్టు వెల్లడించింది. కీలకమైన ఐటీ, బీపీఓ, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ సెక్టార్లలో అంతకు ముందు నెలతో పోలిస్తే కొంత మెరుగుదల కనబడుతోందని నౌకరి.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయెల్ చెప్పారు. హాస్పిటాలిటీ, రిటెయిల్ సెక్టార్లు కొత్త నియామకాలలో ముందున్నాయని పేర్కొన్నారు. కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాలలో కొత్త ఉద్యోగాలు 30 శాతం పెరిగాయని, మాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ జోరు పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు 10 శాతం, పర్చేజ్, లాజిస్టిక్స్ జాబ్స్ 6 శాతం పెరిగినట్లు నౌకరి రిపోర్టు తెలిపింది. దేశపు సగటుతో పోలిస్తే మెట్రో సిటీలలో రిక్రూట్మెంట్ యాక్టివిటీ తక్కువగానే ఉందని, కరోనా తీవ్రత కొంత ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని పేర్కొంది. ముంబైలో 28 శాతం, హైదరాబాద్లో 26 శాతం హైరింగ్ తగ్గిందని వెల్లడించింది.