ముగిసిన మేడారం మహా జాతర.. వనంలోకి జన దేవతలు

ముగిసిన మేడారం మహా జాతర.. వనంలోకి జన దేవతలు

మేడారం జాతర ముగిసింది. సమ్మక్క-సారక్క అమ్మవార్లు వన ప్రవేశం చేశారు. చివరిరోజు వనదేవతల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు భక్తులు. ఇక...అధికారుల తీరుపై ఆగ్రహ వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. సీఎం, పీఎం మేడారం ఎందుకు రాలేదన్నారు రేవంత్ రెడ్డి. జాతర సక్సెస్ కోసం అవమానాలు భరించానన్నారు సీతక్క. 

మేడారం సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం వైభవంగా ముగిసింది. డప్పులు, డోలు వాయిద్యాల మధ్య పూజారులు అమ్మవార్లను వనంలోకి తీసుకెళ్లారు. గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత భారీ పోలీసు బందోబస్తు మధ్య అమ్మవార్లను వనప్రవేశానికి తీసుకెళ్లారు. జాతర చివరి రోజున గవర్నర్ తమిళిసై వన దేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి పూజలు చేశారు. అమ్మవార్ల దీవెనలు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.

మేడారం జాతరకు జాతీయ పండుగగా కేంద్రం ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జాతరకు నిధులు తీసుకు రావడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు. 8 ఏళ్లలో ప్రధాని మోడీ ఎందుకు మేడారం రాలేదన్నారు ఎర్రబెల్లి. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సీఎం కేసీఆర్ మేడారం జాతరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సమ్మక్క పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని సీఎం కించపరిచారన్నారు. మేడారం సమ్మక-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రేవంత్. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలని డిమాండ్ చేశారు. ముచ్చింతల్ కు వచ్చిన ప్రధాని మోడీ మేడారం ఎందుకు రాలేదన్నారు. సీఎం, పీఎం కలిసి మేడారం జాతరను చిన్నగా చూపే కుట్ర చేస్తున్నారన్నారు.  

మేడారం జాతర నిర్వహణలో సక్కెస్ అయ్యామని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణాదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు. మంత్రులు, పోలీసులతో పాటు జిల్లాలోని అన్ని శాఖలు బాగా సహకరించాయని చెప్పారు. మరోవైపు మేడారంలో కన్నెపల్లి సారలమ్మ పూజారులు ఆందోళనకు దిగారు. పోలీసులు తమను కొట్టారని రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ధర్నా చేశారు. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడటంతో ఆందోళన విరమించారు. ఆఖరి రోజున భక్తులు పోటెత్తారు. అమ్మవార్లకు చీరె, సారెలు, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల ప్రాంగణం,  జంపన్నవాగు పరిసరాలు భక్తులతో  కిక్కిరిసిపోయాయి. శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు నృత్యాలు, తీన్మార్ స్టెప్పులతో అడవంతా మార్మోగింది. ఆదివాసీలు, గిరిజనుల డ్యాన్స్ లు అందరిని ఆకట్టుకున్నాయి.