మూడేళ్లుగా భద్రాచలం దేవస్థానంలో ముందుకు సాగని ప్రాజెక్టు

మూడేళ్లుగా భద్రాచలం దేవస్థానంలో ముందుకు సాగని ప్రాజెక్టు

భద్రాచలం, వెలుగు:శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోలార్​ ప్రాజెక్టు ఏర్పాటు ముందుకు సాగడం లేదు. దేవస్థానంతో ఒప్పందం చేసుకున్న సన్​ టెక్నాలజీస్​ సంస్థ ఇంకా పనులు షురూ చేయకపోవడంతో మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు పెండింగ్​లో ఉంది. విడతల వారీగా అవసరమైన పరికరాలను పంపుతోంది. పనులు రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సోలార్​ వెలుగులు కలిగిన ఏకైక గుడిగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో రికార్డులకెక్కుతుంది. కానీ నేటికీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. విదేశాల నుంచి వస్తున్న సోలార్​ పరికరాలపై కేంద్రం ఇటీవల ట్యాక్స్ పెంచడమే ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమని చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే సోలార్  ప్లేట్లు భద్రాచలానికి సంస్థ పంపించింది. త్వరలో పనులు స్టార్ట్​ చేస్తామని చెప్తోంది. 

2020లో ప్రారంభించినా..

ఆర్టీసీలో సోలార్​ ప్రాజెక్టు నిర్వహిస్తున్న సన్​టెక్నాలజీస్​ 2020లో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో కూడా వెలుగులు అందించేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్​ను దేవస్థానం ఎండోమెంట్​ కమిషనర్​ అనుమతి కోసం పంపించింది. ఏడాది తర్వాత 2021లో కమిషనర్​ నుంచి అనుమతి వచ్చింది. రామాలయంతో పాటు 27 కాటేజీలు, 140 రూమ్​లు, నిత్యాన్నదాన సత్రం తదితర అన్ని చోట్ల సోలార్​ లైట్లు ఏర్పాటు చేసేందుకు సన్​టెక్నాలజీస్​తో దేవస్థానం ఒప్పందం చేసుకుంది. 25 ఏళ్లపాటు ఒకే ధరతో కరెంట్​ ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగింది. కిలో వాట్​ నుంచి 10 కిలో వాట్ వరకు యూనిట్​కు రూ.5.80, 11 కిలో వాట్స్ నుంచి 100 కిలోవాట్ల వరకు యూనిట్​కు రూ.5.50, 100 కిలోవాట్లు దాటితే యూనిట్​ రూ.4.80లు చొప్పున సంస్థకు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. ప్రస్తుతం దేవస్థానం నెలకు రూ.7 లక్షల చొప్పున ట్రాన్స్ కోకు బిల్లులు చెల్లిస్తోంది. సోలార్​ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దేవస్థానానికి 40 శాతం బిల్లులు ఆదా అవుతాయి. 

సంప్రదింపులుజరుపుతున్నాం

సోలార్​ ప్రాజెక్టు విషయంలో సన్​ టెక్నాలజీస్​ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. మెటీరియల్​ పంపారు. సోలార్​ ప్యానెల్స్, బోర్డులు, ఇతర వస్తువులు అన్నీ వచ్చాయి. వాళ్ల స్టాఫ్​ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో కాస్త ఆలస్యం అవుతోంది. త్వరలోనే పనులు మొదలవుతాయి.
- రవీందర్​రాజు, దేవస్థానం ఈఈ