చేప ప్రసాదం పంపిణీ.. బారులు తీరిన జనం

చేప ప్రసాదం పంపిణీ.. బారులు తీరిన జనం

హైదరాబాద్​లోని నాంపల్లి గ్రౌండ్స్​లో బత్తిని సోదరుల ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రసాదం కోసం రాత్రి నుంచి జనం క్యూలు కట్టారు. కొందరు రాత్రికే అక్కడికి  చేరుకుని నిద్రపోయారు. 5 లక్షల మందికి 5 క్వింటాళ్ల చేప మందు పంపిణీ చేస్తున్నారు. 34 కౌంటర్లు, 32 క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అధికారులు టోకెన్​ కోసం రూ.40 వసూలు చేస్తున్నారు. క్యూ లైన్ లోనే వీటిని అందిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు దాదాపు 15 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు.  దాదాపు 1500 మంది పోలీసులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

 కరోనా కారణంగా మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ జరగలేదు. ఈసారి చేప ప్రసాదం అందిస్తుండటంతో జనం ఒక్కసారిగా తరలివచ్చారు. పంపిణీకి ఒకరోజు ముందే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో క్యూలైన్లు నిండిపోయాయి. చేప ప్రసాదం కోసం వచ్చేవాళ్లకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ఎంట్రెన్స్ వద్ద ప్రత్యేకంగా 18 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.  దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు దూద్ బౌలిలోని బత్తిన నివాసం వద్ద కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 

5 లక్షల మంది వస్తరని అంచనా

కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, చత్తీస్​గఢ్ నుంచి ప్రజలు చేప మందు కోసం వస్తారని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. దాదాపు 5లక్షల మంది వరకు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ఎంతమంది వచ్చినా చేప ప్రసాదం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని బత్తిన సాయినాథ్ గౌడ్ తెలిపారు. 

మెయిన్ సెంటర్ల నుంచి ప్రత్యేక బస్సులు

చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​కు వెళ్లేందుకు ప్రధాన కూడళ్ల నుంచి 130 సిటీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌‌, కాచిగూడ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్​సుఖ్​నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరికొన్ని బస్సులు పెంచుతామన్నారు. మెట్రో రైళ్ల సంఖ్య కూడా పెంచనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు.

ప్రభుత్వం సహకరిస్తోంది..

చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని బత్తిని హరినాథ్​గౌడ్​ తెలిపారు. 250 కుటుంబ సభ్యులు, పదుల సంఖ్యలో వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.