
హెచ్ఆర్ఏ ఆధారంగా మూడు కేటగిరీలుగా స్కూళ్లు
ఒకే జిల్లాలో పనిచేస్తేనే స్పౌజ్ పాయింట్లు
బదిలీలు, ప్రమోషన్లపై గైడ్లైన్స్ విడుదల
హైదరాబాద్, వెలుగు : జీవో 317 బాధితుల గోడును సర్కారు పట్టించుకోలేదు.. టీచర్ల సంఘాల విజ్ఞప్తులనూ వినిపించుకోలేదు. సర్కారు అనుకున్నట్టే ఈ ఏడాది కూడా రెండేండ్ల సర్వీస్ ఉంటేనే ట్రాన్స్ఫర్లకు అర్హులని తేల్చింది. ఫిబ్రవరి 1వ తేదీనాటికీ ఒకే స్కూల్లో ఐదేండ్లు సర్వీస్ నిండిన హెడ్మాస్టర్లు, 8 ఏండ్లు సర్వీస్ పూర్తయిన టీచర్లకు బదిలీలు తప్పనిసరి కానున్నది. దీంట్లో మూడేండ్లలోపు రిటైర్ అయ్యే వారుంటే, బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు పొందిన హెడ్ మాస్టర్లు, టీచర్లు ఈ విద్యాసంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. కాగా ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించిన గైడ్లైన్స్ ను సర్కారు అనధికారికంగా బహిర్గతం చేసింది. ఈసారి కూడా మేనేజ్మెంట్ల వారిగానే బదిలీలు, ప్రమోషన్లు జరగనున్నాయి. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరగనుండగా, ఎన్సీసీ ఆఫీసర్లకు మాత్రమే మాన్యువల్గా కౌన్సెలింగ్ ఉంటుంది. హెడ్మాస్టర్లకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర టీచర్లకు జిల్లాస్థాయిలో బదిలీలు, ప్రమోషన్లు ఉండనున్నాయి.
ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల కోసం 12 జిల్లాలకు స్టేట్ అబ్జర్వర్లు
హైదరాబాద్, వెలుగు: టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు 12 జిల్లాలకు స్టేట్ అబ్జర్వర్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన నియమించారు. రెండ్రోజుల కింద జరిగిన డీఈవోల మీటింగ్లో తమకు స్టేట్ నుంచి సహాయం అవసరమని కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లాకు ఉషారాణి(మోడల్ స్కూల్ డైరెక్టర్), గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఉషారాణి (ఐఏఎస్ఈ ప్రిన్సిపల్), ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు శ్రీనివాస్చారి (టెక్ట్స్ బుక్ డైరెక్టర్), జగిత్యాలకు రాజీవ్ (ఎస్ఎస్ఏ జేడీ), మెదక్, కరీంనగర్జిల్లాలకు క్రిష్ణారావు (ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్), మహబూబాబాద్ జిల్లాకు ఎన్ఎస్ఎస్ ప్రసాద్ (మోడల్ స్కూల్ డీడీ), ములుగు, భూపాలపల్లి జిల్లాలకు మధన్ మోహన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెంకటనర్సమ్మను నియమించారు.
గైడ్లైన్స్లోని కొన్ని పాయింట్లు..
* హెచ్ఆర్ఏ 17శాతం, 13శాతం, 11శాతం కేటగిరీల ప్రకారం 1,2,3 కేటగిరీలుగా స్కూళ్లను మార్చారు. ఏటా వరు సగా 1,2,3 పాయింట్లు అలాట్ చేశారు. ఈసారి నాలుగో కేటగిరీ తొలగించారు.
* అదర్ డ్యూటీ (ఓడీ) ఉన్న టీచర్ల సంఘాలకు, గుర్తింపున్న టీచర్ల సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు పది అడిషనల్ పాయింట్లు ఉంటాయి.
* గర్ల్స్ స్కూళ్లలో 50 ఏండ్లలోపున్న టీచర్లకు బదిలీలు తప్పనిసరి. అయితే గర్ల్స్ స్కూళ్లలో మహిళలెవరూ లేని సందర్భంలో 50 ఏండ్లు నిండిన పురుష టీచర్లను అనుమతించనున్నారు.
* గతంలో ఉన్న ఎస్ఎస్ సీ ఫార్మార్మెన్స్ పాయింట్లు, సర్వీస్ పాయింట్లు తీసేశారు.
* స్పౌజ్, పెండ్లికాని మహిళలకు పది అడిషనల్ పాయింట్లు ఉంటాయి. 8 ఏండ్లలో ఒకేసారి వీటిని వాడుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తింపు
* ప్రిఫరెన్షియల్ కేటగిరీ లో 70 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులు, వితంతువులు, విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్న మహిళలు, హెడ్మాస్టర్లు/టీచర్ల జీవిత భాగస్వామి (స్పౌజ్) క్యాన్సర్, బోన్ టీబీ, బైపాస్ సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, న్యూరో సర్జరీలతో పాటు కొత్తగా మస్క్యులర్ డిస్ట్రోఫీ, డయాలసిస్ కు అనుమతి.
* జువెనైల్ డయాబెటిస్, మానసిక వైకల్యం, హృద్రోగం ఉన్న పిల్లల పేరెంట్స్ ను ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉంటారు. ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరి వాడుకునే వారు 2023 జనవరి 1 తర్వాతి తేదీల్లో జిల్లా మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పెట్టాలి.
* టీచర్లు ఇద్దరుంటే స్పెషల్ కేటగిరీ పాయింట్స్ లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వాడుకోవాలి.
* ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్ పాయింట్స్ వర్తిస్తాయి.