తమ్ముడి పెళ్లి ఆపాలని.. పురుగుల మందు తాగిన అక్క

తమ్ముడి పెళ్లి ఆపాలని.. పురుగుల మందు తాగిన అక్క

ఆసిఫాబాద్, వెలుగు: భర్త చెల్లెలితో తన తమ్ముడి పెండ్లి కుదరడం, ఆదివారం ముహూర్తం కూడా పెట్టడంతో ఇష్టం లేని వరుడి అక్క పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెండ్లి వద్దని చాలాసార్లు తల్లిదండ్రులకు, కుటుంబీకులకు చెప్పి చూసింది. అయినా ఫలితం కనిపించలేదు. ‘నీ భర్తకు నలుగురు అక్కాచెల్లెళ్లున్నరు. ఒక ఆడపిల్లను చేసుకుంటే ఆసరాగా నిలిచిన వాళ్లమవుతాం’ అని తండ్రి ఆమెకు నచ్చజెప్పాడు. దీంతో తాను ఎంత చెప్పినా వినడం లేదని పురుగుల మందు తాగింది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కనార్ గావ్​లో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలం అడ గ్రామానికి చెందిన నగోసే గణపతికి ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులున్నారు. వీరిలో పెద్ద బిడ్డ తానుబాయి(32)కి కనార్ గావ్​కు చెందిన వడై గౌరయ్య తో కొన్నేండ్ల కింద పెండ్లి చేశారు. వీరికి ఇద్దరు బిడ్డలున్నారు. తానుబాయి తమ్ముడు మునీశ్వర్ కు ఆమె ఆడపడుచు జిజాబాయితో ఇటీవలే పెండ్లి  నిశ్చయం చేసుకున్నారు. తన ఆడపడుచుతో తమ్ముడుకి పెండ్లి చేయడం ఇష్టం లేదని తానుబాయి చెబుతూ వస్తోంది. దీనికి తండ్రి ఒప్పుకోకపోగా, ఆమెకు సర్ది చెప్పాలని చూశాడు. ఆదివారం పెండ్లి ఉండగా, శనివారం కనర్​గావ్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎట్లయినా పెండ్లి ఆపాలని అనుకున్న తానుబాయి శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆసిఫాబాద్ హాస్పిటల్ కు తరలించగా ట్రీట్​మెంట్ ​తీసుకుంటూ చనిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్​ తెలిపారు.