గంభీరావుపేట, వెలుగు: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర బందోబస్తుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న బి.రమేశ్(51) ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో బందోబస్తు డ్యూటీ చేస్తున్నారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చెందిన రమేశ్ 317 జీవో ద్వారా ఇటీవలే గంభీరావుపేట పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చాడు. హెడ్ కానిస్టేబుల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ మొగిలి, ఎస్సై మహేశ్సంతాపం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని పోలీసు శాఖ తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని డీఎస్పీ చంద్రశేఖర్ చెప్పారు.