- ఎమ్మెల్యే సబిత కొడుకు పిటిషన్ డిస్మిస్
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొడుకు, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక అందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి ఆస్కారం లేదని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన డివిజన్బెంచ్ గురువారం తీర్పు చెప్పింది. పిటిషన్ విచారణకు ముందే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందునా తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఈసీ నిర్ణయం ఉందని చెప్పింది. ఒకే ఓటును ప్రాధాన్యతా క్రమంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేసేలా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్న నిబంధననను ఈసీ ఉల్లంఘించిందని పిటిషనర్ తరఫు అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ వాదించారు. డిసెంబరు 9న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలకు వేర్వేరు నోటిఫికేషన్లు వెలువరిస్తామని ఈ నెల 4న ఈసీ అధికారులు ప్రకటించడాన్ని తప్పుపట్టారు. వేర్వేరు ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణ నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ అడ్వొకేట్ అవినాశ్ దేశాయ్ ప్రతివాదన చేస్తూ.. ఈసీ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే 171(4) కింద ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని చెప్పారు. రిట్ పిటిషన్ చెల్లదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా గురువారమే వెలువడిందని, ఈ నెల 29న ఎన్నికలు జరుగుతాయని వివరించారు.
ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందనా ఈ అంశంపై కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని విన్నవించారు. గతంలో బీహార్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లోని 6 సాధారణ ఖాళీలకు ఇదే తరహాలో ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. ఈసీ వాదనను హైకోర్టు ఆమోదించి పిటిషన్ను కొట్టేసింది.