హైదరాబాద్, వెలుగు: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, వైద్య విధాన పరిషత్ శాఖల ద్వారా రూరల్, ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే డాక్టర్లకు పీజీ మెడికల్ అడ్మిషన్స్లో ఇన్ సర్వీస్ కోటా జీవో 155 అమలు చేయడంపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర సర్కార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 12వ తేదీన జరిగే విచారణలో చెప్పాలని ఏజీని ఆదేశించింది. అప్పటి దాకా పీజీ మెడికల్ అడ్మిషన్లు ముగించొద్దని, గతంలో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ట్రైబల్ ఏరియాలో రెండేండ్లు, రూరల్లో మూడేండ్లు, ఇతర ప్రాంతాల్లో ఆరేండ్లు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసిన వాళ్లకు పీజీ మెడికల్ అడ్మిషన్లలో ఇన్సర్వీస్ కోటా అమలుకు జీవో వెలువడిందని, ఇది అమలు కాకపోవడంపై డాక్టర్ దినేశ్ కుమార్ మరో ముగ్గురు రిట్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామావరపు రాజేశ్వర్రావుతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది.
కాళోజీ వర్సిటీ అడ్వొకేట్ ప్రభాకర్రావు వాదిస్తూ.. 6 ఏండ్లు సర్వీస్ ఉన్న వాళ్లకు ఇన్సర్వీస్ రిజర్వేషన్లు అమల్లో ఉన్నట్లు చెప్పారు. పిటిషనర్ అడ్వొకేట్ ఎస్.సందీప్రెడ్డి వాదిస్తూ.. జీవో అమలు గురించి వర్సిటీ చెప్పకుండా 6 ఏండ్లు సర్వీస్ ఉన్న వాళ్లకు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ఇరువైపు వాదనల విన్న హైకోర్టు.. విచారణను 12కి వాయిదా వేసింది.