
- ఏడాదిన్నర నుంచి ఏం చేస్తున్నారని ప్రశ్న
- మరో నెల టైం అడిగిన రాష్ట్ర ప్రభుత్వం
- 2 నెలల సమయమివ్వాలన్న ఎలక్షన్ కమిషన్
- ఎలక్షన్ పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించాలని పిటిషనర్ల రిక్వెస్ట్
- లోకల్ బాడీ ఎలక్షన్స్పై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని అడిగింది. నిరుడు డిసెంబర్లో రెండు నెలల్లోగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పి.. ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు వేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఫైనలైజ్ చేసేందుకు మరో 30 రోజుల సమయం కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. కాగా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రం నుంచి అన్ని ఏర్పాట్లు జరిగితే ఎన్నికల నిర్వహణకు తమకు రెండు నెలల గడువు కావాలని రిక్వెస్ట్ చేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందన్నారు.
ఎలక్షన్ పెట్టకుంటే పాతోళ్లనే కొనసాగించాలి: పిటిషనర్ల తరఫు అడ్వకేట్
సర్పంచ్ల పదవీకాలం 2024 జనవరి 31తో ముగిసిందని, ఏడాదిన్నరకాలంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ భాస్కర్ రెడ్డి వాదనలు వినిపించారు. సర్పంచుల కాలపరిమితి పూర్తైన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చట్టం నిర్దేశిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు స్పెషలాఫీసర్ల పాలనలో నడుస్తున్నాయని తెలిపారు. ఎన్నికలు నిర్వహించడం ఆలస్యమైతే ఆ పదవీ బాధ్యతలను సర్పంచులకు అప్పగించేలా రాష్ట్రానికి ఆదేశాలివ్వాలని కోరారు.
పదవీ కాలం అయ్యాక ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణలను, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 నిబంధనను ఉల్లంఘించినట్లేనని చెప్పారు. గతంలో కూడా ప్రభుత్వం వాయిదా కోరిందని కోర్టు దృష్టికి తెచ్చారు. స్పెషాలాఫీసర్ల పాలనలో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పారు. కాగా, ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి నిర్వహించలేదని, మళ్లీ నెల వాయిదా ఎందుకు కోరుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సర్పంచ్లను తిరిగి పదవుల్లో కొనసాగించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చిన జడ్జి జస్టిస్ టీ మాధవీదేవి.. తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తుర్వులిచ్చారు.