శామీర్ పేట, వెలుగు: కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని డిపో మెకానిక్ చనిపోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. సింగాయిపల్లికి చెందిన వెంకటేశ్(43) హకీంపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం భార్య, ముగ్గురు పిల్లలు, బంధువులైన మరో ముగ్గురు మహిళలతో కలిసి కారులో మేడ్చల్ పరిధి మునీరాబాద్ సమీపంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి బయలుదేరాడు. హకీంపేట డిపో వద్దకు రాగానే ప్రజ్ఞాపూర్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేశ్ అక్కడిక్కడే మృతి చెందగా.. అతడి భార్యాపిల్లలు, ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థాని
కులు వీరిని అల్వాల్లోని ఓ హాస్పిటల్కు తరలించారు. తాను పనిచేసే డిపో దగ్గరే ప్రమాదం జరిగి వెంకటేశ్ ప్రాణాలు కోల్పోవడం తోటి కార్మికుల్లో విషాదాన్ని నింపింది.
కారు ఢీకొని గాయపడ్డ కానిస్టేబుల్..
కారు ఢీకొని కానిస్టేబుల్ గాయపడ్డ ఘటన శామీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. వికారాబాద్కు చెందిన షరీఫ్(26) శామీర్ పేట పీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ అదే ఏరియాలో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం షరీఫ్ కూతురు తొట్టెల ఫంక్షన్ ఉంది. దీంతో గురువారం అర్ధరాత్రి వరకు డ్యూటీ చేసి ఇంటికి బయలుదేరాడు. అదే టైమ్లో అచ్చాయిపల్లి క్రాస్ రోడ్ దగ్గర రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో విషయం తెలుసుకున్న షరీఫ్ అక్కడికి వెళ్లాడు. ఘటనాస్థలంలో ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేస్తుండగా.. ఓ కారు వచ్చి అతడిని ఢీకొట్టి వెళ్లింది. ప్రమాదంలో షరీఫ్ తలకు బలమైన గాయం కాగా.. మొబైల్ వెహికల్ డ్రైవర్, హోంగార్డు గోపియా స్వల్పంగా గాయపడ్డాడు. షరీఫ్ను సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట పోలీసులు తెలిపారు.