వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్.. మహిళను దారుణంగా హత్య చేసిన కిష్టయ్య

వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్.. మహిళను దారుణంగా హత్య చేసిన కిష్టయ్య

కళ్లు బైర్లు కమ్మే విషయం ఇది.. ఒళ్లు జలదరించే షాకింగ్ న్యూస్ ఇది.. మీరు ఒంటిపై బంగారు నగలు వేసుకుని బయటకు ఒంటరిగా వెళ్తున్నారా..? అయితే.. జాగ్రత్త.. అపరిచిత వ్యక్తులెవరైనా మీతో మంచిగా మాట్లాడుతూ మాటల్లో పెట్టే చాన్స్ ఉంది. ఎందుకంటే ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది..

వికారాబాద్ జిల్లా తాండూరులో అదృశ్యం అయిన మహిళ ఘటన విషాదాంతంగా ముగిసింది. అదృశ్యమైన మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే హత్య జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు సైకో కిల్లర్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితుడు దాదాపు ఆరు కేసుల్లో ఉన్నాడని, అతడు రౌడీ షీటర్ అని కూడా చెబుతున్నారు పోలీసులు.

డీఎస్పీ శేఖర్ గౌడ్ చెప్పిన వివరాల ప్రకారం.. 

నవంబర్ 29వ తేదీన తాండూర్ కు చెందిన సర్వబీ అనే మహిళ కూలి పనుల కోసం వెళ్లి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు సర్వబీ కోసం అన్ని చోట్ల గాలించారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులు తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 1న కేసు పెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. 

సర్వబీ.. మరో వ్యక్తి తో మాట్లాడుతున్న విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. సర్వబీతో మాట్లాడుతున్న వ్యక్తి.. ధరూర్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టయ్యగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం కిష్టయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కూలి పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. సర్వబీని పెద్దేముల్ మండలం తాట్టేపల్లి అడవిలోకి తీసుకెళ్లాడు కిష్ణయ్య. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమె చీర కొంగు మెడకు బిగించి హత్య చేశాడు. గురువారం (డిసెంబర్ 7న) సర్వబీ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. అక్కడే శవ పరీక్ష చేశారు. మాల కిష్టయ్య.. ఆరు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇప్పటికే అతడిపై ఉన్న ఐదు కేసులను కోర్టు తొలగించింది. మరో కేసులో నిందితుడుగా కొనసాగుతున్నాడు.