
లక్నో : డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్2లో భాగంగా మొరాకో జట్టుతో పోరులో తొలి రోజు ఇండియా టెన్నిస్ టీమ్కు మిశ్రమ ఫలితాలు లభించాయి. శశికుమార్ ముకుంద్ నిరాశ పరచగా.. ఇండియా నం.1 సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఆకట్టుకున్నాడు. దాంతో శనివారం జరిగిన సింగిల్స్లో ఇండియా, మొరాకో 1–1తో సమంగా నిలిచాయి. ఇండియా డేవిస్ కప్ టీమ్లో తొలిసారి చోటు దక్కించుకున్న 26 ఏండ్ల ముకుంద్ ఆకట్టుకోలేకపోయాడు.
ప్రతికూల వాతావరణంతో ఇబ్బంది పడ్డ అతను యాసిన్ డ్లిమితో ఆరంభ పోరులో 7–6 (4), 5–7, 1–4తో వెనుకబడిన దశలో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. కండరాలు పట్టేయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ శశి మూడో సెట్లో 1–2తో ఉన్న దశలో మెడికల్ టైమౌట్ తీసుకున్నాడు. తిరిగి ఆట మొదలైన కొద్దిసేపటికే నొప్పి పెరగడంతో ఆట నుంచి తప్పుకున్నాడు. దాంతో డ్లిమి విన్నర్గా నిలవగా.. ఇండియా 0–1తో వెనుకబడింది.
రెండో సింగిల్స్లో మాత్రం సుమిత్ తన స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్ చేశాడు. 156వ ర్యాంకర్ సుమిత్ 6–3, 6–3తో 511వ ర్యాంకర్ ఆడమ్ మౌండిర్ను వరుస సెట్లలో చిత్తుగా ఓడించి స్కోరు సమం చేశాడు. ఆదివారం డబుల్స్లో రోహన్ బోపన్న–యూకీ భాంబ్రీ బరిలో నిలవనుంది. అనంతరం రివర్స్ సింగిల్స్లో ముకుంద్, నాగల్ పోటీ పడతారు. కెరీర్లో తనకిదే చివరి డేవిస్ కప్ పోరు కావడంతో బోపన్న డబుల్స్లో గెలవడంతో పాటు ఇండియాను గెలిపించాలని కోరుకుంటున్నాడు.