
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్ లు ఆడిన భారత మహిళల జట్టు సిరీస్ ని ఓటమితో ముగించింది. మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడితే నాలుగింటిలోనూ విఫలం అయింది. స్టార్ బౌలర్లు, బ్యాటర్లు సైతం ఆస్ట్రేలియా ప్లేయర్లను అడ్డుకోలేకపోయారు. రెండవ టీ20 మినహా మిగిలిన నాలుగు మ్యాచ్ లు అన్నింటిలో చేతులెత్తేశారు. దీనికి కారణం డెత్ ఓవర్లలో చెత్త బౌలింగేనని అంటోంది కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్.
పవర్ ప్లే, మొదటి పది ఓవర్ల వరకు బ్యాటర్లను కట్టడి చేస్తున్నా.. డెత్ ఓవర్లు వచ్చేసరికి చతికిలపడిపోతున్నారు. తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లి పరుగులు ఇచ్చేస్తున్నారు. ఇదివరకు ఈ సమస్య పవర్ ప్లేలో ఉండేది. దానికిపై కఠినంగా శ్రమించిన భారత మహిళల జట్టు కొంతవరకు ఆటను మెరుగుపరుచుకుంది. ఇప్పుడున్న డెత్ బౌలింగ్ సమస్యపైన కూడా పనిచేసి తిరిగి గాడిన పడతామని హర్మన్ప్రీత్ కౌర్ చెబుతోంది. అయితే, ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచకప్ ముందు భారత మహిళల జట్టుకు ఇది కలవరపరిచే విషయం. కాకపోతే నెలరోజుల పాటు ఆటకు బ్రేక్ ఉండటంతో ఆటగాళ్లు వాళ్ళ లోటుపాట్లను సరిచేసుకొని.. తిరిగి రాణిస్తారని హర్మన్ప్రీత్ కౌర్ ఆశిస్తోంది.