వ‌య‌నాడ్ గ‌బ్బిలాల్లో నిపా వైర‌స్‌..కేరళ ప్రభుత్వం హెచ్చరిక

వ‌య‌నాడ్ గ‌బ్బిలాల్లో నిపా వైర‌స్‌..కేరళ ప్రభుత్వం హెచ్చరిక

కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిఫా వైరస్ ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఐసీఎంఆర్‌ ఇచ్చిన నివేదికను గుర్తు చేస్తూ..  కేరళ ఆరోగ్యశాఖమంత్రి వీణా జార్జ్‌ ఈ విషయాన్ని చెప్పారు. సుల్తాన్ బ‌తేరి, మ‌నంత‌వాది ప్రాంతాల్లో ఉన్న గ‌బ్బిలాల్లో నిపా వైర‌స్ ఉన్నట్లు గుర్తించామ‌న్నారు. గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించి జరిపిన అధ్యయనాల ఆధారంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఈ సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు.  

జంతువులు, ప‌క్షలు కొరికిన పండ్లను తిన‌కూడ‌ద‌ని మంత్రి స‌ల‌హా ఇచ్చారు. ఇత‌ర జిల్లాల్లోనూ నిపా వైర‌స్ ఉందా లేదా అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి వీణా జార్జ్ చెప్పారు. రాష్ట్రంలోని ఆరోగ్య శాఖను, సాధారణ ప్రజల్ని అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ సమాచారం వెల్లడించినట్లు చెప్పారు. కేవలం వాయనాడ్‌ జిల్లాలోనే కాకుండా కేరళలోని ఇతర జిల్లాల్లో ఉండే గబ్బిలాల్లోనూ నిఫా వైరస్‌ ఉండే అవకాశం ఉందన్నారు. 

గత నెలలో కొయ్‌కోడ్‌లో ఆరుగురికి నిఫా వైరస్‌ సోకింది. ఇద్దరు మృతిచెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని మంత్రి వీణాజార్జ్‌ మీడియాకు వివరించారు. వైరస్‌ సోకిన వారితో కాంటాక్టులో ఉన్నవారి క్వారంటైన్‌, ఐసోలేషన్‌ సమయం ముగిసిందన్నారు. 

నిఫా వైరస్‌పై పరిశోధన కోసం కేరళ రాష్ట్రంలో ఒక హెల్త్‌ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసి.. అన్ని శాఖల సమన్వయంతో స్వతంత్రంగా పరిశోధన చేసే దిశగా ముందుకెళ్తామని మంత్రి వీణాజార్జ్‌ చెప్పారు.  కేరళలో 2018లో తొలిసారిగా నిఫా వైరస్‌ (Nipha Virus) వెలుగు చూసిన విషయం తెలిసిందే.