వాషింగ్టన్: పేరుకుపోతున్న భారతీయుల వీసా దరఖాస్తులను వేగంగా క్లియర్ చేసేందుకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రెసిడెన్షియల్ కమిషన్ చేసిన పలు సిఫార్సులను అమలు చేయాలని డిసైడ్ చేసింది. వీసా దరఖాస్తులు వెల్లువెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీసా అపాయింట్మెంట్లను కేటాయించేందుకు ఇండియా వెలుపల కూడా అమెరికా దౌత్య కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయం వెలువడటంలో ప్రెసిడెన్షియల్ కమిషన్ సభ్యుడిగా ఉన్న భారత సంతతి వ్యక్తి అజయ్ జైన్ భుటోరియా కీలక పాత్ర పోషించారు. అమెరికాలో చదువుకోవడానికి , టూర్కు వెళ్లాలని భావించే భారతీయులు వీసాలు దొరకక ఎంతోకాలం ఎదురుచూడాల్సి వస్తోందని ఆయన కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో తాజా నిర్ణయం వెలువడింది.
వీలైన చోట వర్చువల్ ఇంటర్వ్యూలు
వీలైన చోట వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్కు ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫారసు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్ల సిబ్బందిలో కొంతమందిని వీసా దరఖాస్తులు భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్న దౌత్య కార్యాలయాల్లో విధులకు కేటాయించాలని సూచించింది. ఇలా కేటాయించే సిబ్బంది ద్వారా దరఖాస్తుదారులను వర్చువల్ ఇంటర్వ్యూలు చేయిస్తే వీసాల జారీ ప్రక్రియ వేగాన్ని పుంజుకుంటుందని పేర్కొంది. ఇప్పటికీ ఎంబసీలు ఉన్నచోట కౌంటర్ల సంఖ్యను పెంచాలని కమిషన్ తెలిపింది. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే భారత్లోని అమెరికా ఎంబసీ 1 లక్ష దరఖాస్తు లను ప్రాసెసింగ్ చేసింది. 2019 జులై తర్వాత ఇంత భారీగా వీసా దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి.