ఫుట్​పాత్​లే అడ్డాలు.. పూటగడవని జీవితాలు

ఫుట్​పాత్​లే అడ్డాలు.. పూటగడవని జీవితాలు

హైదరాబాద్, వెలుగు:   నగరంలో చాలా ఏరియాల్లో ఫుట్ పాత్ ల మీద చుట్టచుట్టిన రంగు రంగుల తుంగచాపలు కనిపిస్తుంటాయి. ఒకవైపు చిన్న పిల్లలు ఆడుతుంటే.. పెద్దలేమో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తుంటారు. చాప(మ్యాట్​)లు అమ్ముడమే జీవనాధారంగా చాలామంది ఉన్నారు. అంతా పొట్ట చేతబట్టుకుని సిటీకి వలస వచ్చినోళ్లే. తాత, ముత్తాతల నుంచి వచ్చిన వృత్తిని ఇంకా కొనసాగిస్తున్నారు. రామచంద్రాపురం, చిలకలగూడ, ఎర్రగడ్డ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తుంగ, సిరి చాపలు అమ్ముతూ నివసిస్తున్నారు. చిలకలగూడలోని మెట్టిగడ్డలో ఈ కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీరంతా బడా వ్యాపారుల నుంచి రెడీమేడ్ చేపలు కొనుగోలు చేసి  వీధివీధి తిరుగుతూ అమ్మకాలు చేస్తారు. వచ్చిన ఆదాయంలో ఇంటి కిరాయి, కుటుంబ పోషణతోపాటు పిల్లల చదువులను నెట్టుకొస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఫుట్ పాత్ పై కూర్చుని అమ్మకాలు చేస్తారు. వయసు పైబడిన వాళ్లు ఒకేచోట కూర్చుని అమ్ముతుంటే.. యువకులు, నడి వయసు ఉన్నోళ్లు కాలనీలు, బస్తీలల్లో వీధివీధి తిరుగుతూ అమ్మకాలు సాగిస్తారు.

ఇట్లా తయారైతయి

కొన్నేళ్ల క్రితం చెరువులో బుడతుంగ తెచ్చి దాన్ని చీల్చి ఎండపెట్టేవాళ్లు. రంగులద్ది కాగులో వేసిన తర్వాత ఎండకు ఆరబెట్టేది. పూర్తిగా ఎండిన తర్వాత మగ్గం మీద తయారు చేసేది. ఇప్పుడు తమిళనాడులో మిషన్ మీదనే తయారు చేస్తున్నారు.  ఒకప్పుడు రూ.15, రూ.20కి అమ్మిన తుంగ చాపలు ఇప్పుడు రూ.800 చేరా యి. దర్ఫ చాపలు,  సిరి చాపలు, ప్లాస్టిక్​తో తయారు చేసినవి కూడా ఉన్నాయి. కు టుంబంలో అంతా కలిసి కూర్చొని అన్నం తినేటప్పుడు పెద్దవి, పూజల సమయంలో దర్పచాపలు వాడుతారు.

షాప్ లో రేట్లు ఎక్కువ రేటు

‘‘తమ దగ్గరకంటే బయట షాపుల్లో రేటు ఎక్కువ రేటు ఉంటుంది. ఒక్కో చాపకి షాపుల్లో రూ.1800 అమ్ముతారు. మా దగ్గరకొచ్చేసరికి చాలామంది బేరలాడుతారు. తాము రూ.800 చెబితే సగానికి సగం అడుగుతుంటారు. అదే పెద్ద పెద్ద షాపుల్లో స్టిక్కర్​ వేసి రూ.1600, రూ.1800 రేటు పెట్టినా కొంటారు. అక్కడ బేరం ఆడే చాన్స్​ ఉండదు. ఉదయం నుంచి ఎండలో,  రోడ్ల పక్కన కూర్చుని అమ్ముకం సాగిస్తే  కనీసం ఒక్కో చాపకు రూ.50 కూడా గిట్టుబాటు కాదు. ఇంటికాన్నుంచే టిఫిన్​ బాక్స్​ తెచ్చుకుంటాం. మధ్యాహ్నం తిండి కూడా ఉండదు. వెళ్లి తిని వద్దామనుకుంటే ఆ టైంలో గిరాకీ వస్తుందేమో అని ఆశ. అందుకే ఎక్కడికీ కదలకుండా రాత్రి దాకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది.”అని తెలిపారు.

పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి

బేగంపేట్, చిలకలగూడలో ఉండే వ్యాపారులు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి చాపలను తెప్పిస్తారు. వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి వీళ్లు అమ్ముతారు. ‘వ్యాపారుల నుంచి రూ.300లకి ఒక చాప చొప్పున తీసుకుని రూ. 400లకు అమ్ముంతుంటాం. కార్తీక మాసంలో అమ్మకాలు పెరుగుతాయి. అయ్యప్ప మాల వేసుకున్నవాళ్లు ఎక్కువగా కొంటారు. మిగతా రోజుల్లో కూలి మాత్రమే వస్తుంది. డబుల్ లేన్ , త్రిబుల్ లేన్, సింగిల్ లేన్ వంటివి ఉంటాయి. వీటిలో సన్నపుల్ల నేత చాపలను చాలా మంది అన్నం తినేటప్పుడు కూర్చునేందుకు వాడుతారు.

పైసల్లేక బడి బంద్ ​చేపించనం

మాది ఖమ్మం జిల్లా మదిర మండలం. హైదరాబాద్ కి వచ్చి పదేండ్లు అయ్యింది. మా ఊళ్లో పనుల్లేక సిటీకి వలస వచ్చాం. మా ఆయన సైకిల్ మీద తిరిగి అమ్ముకొస్తాడు. పైసలు చాలక కొడుకుని బడి బంద్​చేపించి ఇంట్లనే ఉంచుతున్నాం. ఇద్దరం కలిసి పొద్దంతా అమ్మితే నెలకి రూ.10వేల దాకా వస్తాయి.

– దుర్గా, (చాపలు అమ్మే మహిళ)

మాతోనే ఆగిపోవాలె..

చిలకలగూడలో ఉండే సేట్ (వ్యాపారి) దగ్గర నుంచి సరుకు తీసుకుంటాం. నాలుగేండ్లుగా అమ్ముతున్నాం. మా వృత్తికి సీజన్ అంటూ ఉండదు. నెలకి రూ.8వేల నుంచి రూ.10వేల దాకా వస్తాయి. ఇద్దరు ఆడపిల్లలు న్నారు. వారిని హాస్టళ్లో పెట్టి చదివిస్తు న్నాం. మా కష్టం పిల్లలకు రానీయ్యం.      – కోటి, చిలకలగూడ

తాతల కాలం నుంచి..

మా తాతల కాలం నుంచి ఇదే పనిచేస్తున్నాం. జనరేషన్ బట్టి వ్యాపారం మారుతాంది. అప్పట్ల తుంగ చాపలు మగ్గంమీద అల్లేది. ఇప్పుడు ఆ తుంగ దొరకట్లేదు. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారు. మా తాతలు, నాన్న నుంచి మాకు ఈ పని అలవాటైంది. మా పిల్లలను మాత్రం బాగా చదివిస్తాం.   – యేసు, ఆర్సీపురం