కిరాతకం : వాళ్లిద్దరినీ చంపి.. మొసళ్లకు ఆహారంగా వేశారు

కిరాతకం : వాళ్లిద్దరినీ చంపి.. మొసళ్లకు ఆహారంగా వేశారు

ప్రేమ వ్యవహారం ఒక జంట ప్రాణాలు తీసింది. ఈ ఘోరం మధ్యప్రదేశ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరెనా జిల్లాలోని రతన్ బసాయి గ్రామానికి చెందిన శివాని తోమర్(18), బలుపురా కు చెందిన రాధేశ్యామ్​(21) లు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను శివాని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇరువురిని చంపాలని నిర్ణయించుకున్నారు.

వారిద్దరినీ తుపాకితో కాల్చి, బరువైన రాళ్లకు కట్టి మొసళ్లు సంచరించే నదిలోకి విసిరేశారు. 
ఈ క్రమంలో రాధేశ్యామ్​ కనిపించట్లేదని ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట వారిద్దరూ పారిపోయి ఉంటారని భావించిన పోలీసులు, వారు వెళ్లిపోవడాన్ని గ్రామంలోని వారెవరూ చూడలేదనడంతో కేసును సీరియస్​గా తీసుకున్నారు. అనంతరం యువతి తండ్రి, బంధువులను విచారించగా వారిద్దరిని తామే హత్య చేసినట్లు అంగీకరించారు. జూన్​3 న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బరువైన రాళ్లను వారికి కట్టి చంబల్​ నదిలో పడేసినట్లు వారు వెల్లడించారు. మృతదేహాలు వెలికి తీసేందుకు రెస్క్యూ టీం సాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చంబల్​ ఘరియాల్​ అభయారణ్యంలో 2000 కంటే ఎక్కువ ఎలిగేటర్​లు, 500లకు పైగా మంచి నీటి మొసళ్లు ఉన్నాయి.