
ముంబై: కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే స్టూడెంట్లకు ఓటరు రిజిస్ట్రేషన్ను కంపల్సరీ చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గురువారం ముంబైలో రాజ్ భవన్లో జరిగిన నాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల మీటింగ్లో స్టేట్ హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చంద్రకాంత్ పాటిల్ హాజరై మాట్లాడారు. స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో 50 లక్షల మంది స్టూడెంట్లను ఓటర్లుగా నమోదు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, 32 లక్షల మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు ఓటరు నమోదును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం జారీ చేయనుందని మంత్రి వెల్లడించారు. ఎన్రోల్మెంట్ శాతాన్ని పెంచేందుకు యూనివర్సిటీలు ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)లో భాగంగా 2023 జూన్ నుంచి నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు అమలు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో యూనివర్సిటీలకు మరో ఆప్షన్ లేదని, కచ్చితంగా వచ్చే జూన్ నుంచి అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.