- ఇండియా పీసీ మార్కెట్ జోరు పెరిగింది
- 45 లక్షల యూనిట్ల అమ్మకం
- ల్యాప్టాప్లకే ఎక్కువ గిరాకీ
- మరోసారి హెచ్పీయే మార్కెట్ లీడర్
- ఐడీసీ వెల్లడి
న్యూఢిల్లీ: సప్లై చెయిన్ సమస్యలు తీరకపోయినా, చిప్స్ కొరత ఉన్నా ఇండియా పీసీ మార్కెట్ మునుపెన్నడూ లేనంత వేగంతో దూసుకుపోతున్నది. డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు వర్క్స్టేషన్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈ క్యాలెండర్ సంవత్సరం మూడో క్వార్టర్లో ఇండియా పీసీ మార్కెట్ ఆల్-టైమ్ హై షిప్మెంట్లను సాధించింది. రిటైలర్లకు కంపెనీలు 45 లక్షల యూనిట్లను పంపించాయని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. ఈ రిపోర్టు ప్రకారం, 2021 మూడవ క్వార్టర్లో పీసీ మార్కెట్ ఏడాది ప్రాతిపదికన 30 శాతం గ్రోత్ సాధించింది. మనదేశ పీసీ మార్కెట్లో ఇంత పెరుగుదల కనిపించడం ఇదే మొదటిసారి. ప్రపంచమంతటా హార్డ్వేర్ సప్లై ఇప్పటికీ మెరుగుపడలేదు. చిప్స్ కొరత వెన్నాడుతూనే ఉంది. అయినప్పటికీ ఈ సంవత్సరం కన్జూమర్ పీసీ షిప్మెంట్లు కరోనా ముందుకాలం కంటే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం షిప్మెంట్లలో నోట్బుక్ పీసీల వాటా 80 శాతానికి పైగా ఉంది. డెస్క్టాప్ కంప్యూటర్లు 30.5 శాతం గ్రోత్ను రికార్డు చేశాయి.
టాప్ 5 పీసీ సెల్లర్లు ఇవే...
వరుసగా మూడవ క్వార్టర్లోనూ హెచ్పీ దూసుకెళ్లిది. మనదేశానికి క్యూ3లో పది లక్షల యూనిట్లు పంపించింది. మార్కెట్లో నంబర్వన్ ప్లేసును నిలుపుకుంది. 28.5 శాతం వాటాతో మార్కెట్ లీడర్గా నిలిచింది. కన్జూమర్ పీసీ విభాగం మార్కెట్ వాటా మాత్రం 25.3 శాతానికి తగ్గింది. కమర్షియల్ సెగ్మెంట్లో హెచ్పీకి 30 శాతానికి పైగా వాటా ఉంది. డెల్ టెక్నాలజీస్ 23.8 శాతం మార్కెట్వాటాతో రెండవ స్థానంలో నిలిచింది. ఇది పది లక్షల షిప్మెంట్లను సాధించింది. లెనోవో 18.6 శాతం వాటాతో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. లెనోవో కమర్షియల్ ఎగుమతులు 19 శాతం, కస్టమర్ల సెగ్మెంట్ ఎగుమతులు 3.4 శాతం పెరిగాయి. ఏసర్ 8.6 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది. డెస్క్టాప్ కేటగిరీలో దీనికి 31.5 శాతం వాటా ఉంది. అసూస్ మూడు లక్షల యూనిట్లను షిప్ చేసింది. 8.5 శాతం వాటాతో ఐదవ స్థానంలో ఉంది.
మేలు చేసిన వర్క్ ఫ్రమ్ హోం
ఆన్లైన్ క్లాసులు, రిమోట్ వర్కింగ్ విధానాల ల్యాప్టాప్లకు డిమాండ్ కూడా బలంగానే ఉంది. ఈ క్యాలెండర్ సంవత్సరం మూడో క్వార్టర్లో రిటైలర్లు 23 లక్షల కన్జూమర్ పీసీలను అమ్మగలిగారు. ఇండియా కన్జూమర్ పీసీ సెగ్మెంట్ ఇంత భారీగా గ్రోత్ సాధించడం మొదటిసారి. ఆన్లైన్ సెల్లర్లు గత క్వార్టర్లో 7.71 లక్షల యూనిట్లను అమ్మారు. కమర్షియల్ కంప్యూటర్స్ సెగ్మెంట్లోనూ కూడా 47.6 శాతం గ్రోత్ రికార్డయింది. ఎంటర్ప్రైజెస్, ఎస్ఎంబీలు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు ఇస్తున్నాయని, ఇప్పటికీ డిమాండ్–-సరఫరా అంతరం ఉందని ఐడిసి ఇండియా మార్కెట్ ఎనలిస్ట్ భరత్ షెనాయ్ చెప్పారు. దేశంలో స్కూళ్లూ కాలేజీలు తిరిగి తెరవకముందు పీసీ మార్కెట్లో బ్లాక్బస్టర్ గ్రోత్ కనిపించింది. ఇప్పుడు అవి ఓపెన్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇక ముందు మందగించవచ్చని ఐడీసీ హెచ్చరించింది.