
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నోళ్లు మాస్క్ పెట్టుకోనవసరం లేదని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నోళ్లు మాస్క్ పెట్టుకోనక్కర్లేదని ఆ దేశ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సిఫార్సు చేయడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో సగం మందికిపైగా పెద్దలు కరోనా టీకా తీసుకోవడంతో మాస్క్ రూల్ను ఎత్తేశారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా తీసుకున్న చర్యల ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ చెప్పారు. ‘‘మీ అందరి సహకారంతో కరోనా కట్టడిలో పురోగతి సాధించాం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాక్సినేషన్ వేగంగా సాగుతుండడంతో వృద్ధుల్లో కరోనా మరణాలు 80 శాతం తగ్గాయి’’ అని ఆయన అన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నోళ్లు ఇంటాబయటా మాస్క్ లేకుండా ఉండొచ్చన్నారు. సంగీత కచేరిలు, స్పోర్ట్స్ స్టేడియాలకు వెళ్లినప్పుడు మాత్రం కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని జనానికి సూచించారు. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకే ముప్పు చాలా తక్కువ అని సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్స్కీ అన్నారు . ఫిజికల్ డిస్టెన్స్ సాధ్యం కాని ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాలని సిఫార్సు చేశారు.