బాలేశ్వర్: డీఆర్డీవో ఎక్కుపెట్టిన గురి తప్పలేదు. ఎంచుకున్న టార్గెట్ మిస్ అవ్వలేదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తయారు చేసిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్(ఆకాశంలోని టార్గెట్లపైకి భూమ్మీది నుంచి ప్రయోగించే మధ్య శ్రేణి క్షిపణి) టెస్ట్ సక్సెస్ అయింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలేశ్వర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి ఈ మిసైల్ను డీఆర్డీవో టెస్ట్ చేసింది. ఎక్కడో దూరంగా ఉన్న హైస్పీడ్ టార్గెట్ను మిసైల్ తునాతునకలు చేసిందని సంస్థ ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలో భాగమైన ఈ మిసైల్.. అన్ని లక్ష్యాలను కచ్చితత్వంతో అందుకుందని తెలిపింది.
70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలూ ఖల్లాస్
ఈ మిసైల్ సిస్టమ్లో క్షిపణులతో పాటు.. కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎంఎస్), మొబైల్ లాంచర్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ లాంగ్రేంజ్ రాడార్, రాడార్ పవర్ సిస్టమ్, మొబైల్ పవర్ సిస్టమ్, రీలోడర్ వెహికల్, మిసైల్ సిస్టమ్ను తీసుకెళ్లే ఫీల్డ్సర్వీస్ వెహికల్ భాగంగా ఉంటాయి. ఈ మిసైల్ సిస్టమ్ మొత్తాన్ని ఒక ఫైరింగ్ యూనిట్గా పిలుస్తారు. ఇండియన్ ఆర్మీ కోసం ఇజ్రాయెల్ సంస్థ ఐఏఐతో కలిసి డీఆర్డీవో ఈ మిసైల్ సిస్టమ్ను తయారు చేసింది. రాకెట్ మోటార్, కంట్రోల్ సిస్టమ్స్ను డీఆర్డీవోనే సొంతంగా రూపొందించింది. శత్రు దేశాల నుంచి వచ్చే యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, గైడెడ్, అన్గైడెడ్ మిసైళ్లు, సబ్సోనిక్, సూపర్సోనిక్ మిసైళ్లను నాశనంచేసే సత్తా ఈ మిసైల్ సొంతం. 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అల్కగా నాశనం చేయగలుగుతుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు కూడా టెస్టింగ్ను దగ్గరుండి పరిశీలించారు. మిషన్ ఆబ్జెక్టివ్స్ మొత్తాన్ని రికార్డు చేశారు.