
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, ఇతర స్కాన్ ల కోసం ట్రీట్ మెంట్ కొనసాగుతోందని బీసీసీఐ ప్రకటించింది. అయితే... పంత్, శిఖర్ ధావన్ లకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ప్రోగ్రాంలో వారు మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఓ కార్యక్రమంలో శిఖర్ ధావన్ ను పంత్ ఓ విషయం అడుగుతాడు. తనకు ఏదైనా సూచన చేయాలనుకుంటే చేయాల్సిందిగా కోరతాడు. దీనికి శిఖర్ స్పందిస్తూ... బైక్ ను నెమ్మదిగా డ్రైవ్ చేయాలని సూచిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.
ధావన్ చేసిన సూచనను పంత్ పాటిస్తే ఈ ఘోరం జరిగేది కాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. పంత్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ నుంచి రూర్కీకి తమ బంధువులను కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు హరిద్వార్ రూరల్ ఎస్పీ SK సింగ్ తెలిపారు.