
నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ రూపొందించిన ‘అంటే సుందరానికీ’ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిన్న నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నానిగారి నటనే కాదు, ఆయన వ్యక్తిత్వం అంటే కూడా నాకిష్టం. మా ఇంట్లో కూడా ఆయనకి అభిమానులున్నారు. తనకి గొప్ప విజయాలు ఇవ్వాలని భగవంతుణ్ని కోరుకుంటున్నా. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నజ్రియాకి గ్రాండ్ వెల్కమ్. నరేష్, నదియా, రోహిణి సహా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఆల్ ద బెస్ట్. మంచి సంగీతం అందించిన వివేక్ సాగర్కి అభినందనలు. సినిమాకి వెన్నెముక దర్శకుడు. వివేక్ ఆత్రేయ బాగా తీశాడనుకుంటున్నాను. ప్రేక్షకులందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను. తెలుగు సినీ పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది అందరిదీ. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ప్రజల కోసం నిలబడగలిగే గుండె ధైర్యం మీ అభిమానం, తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చాయి. ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటా. పరిశ్రమలో భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ సృష్టత నాకుంది. వివిధ భాషల నుంచి వచ్చిన నటులు, ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా. అలాంటి పరిశ్రమ అంటే నాకు అపారమైన గౌరవం. అలాంటి పరిశ్రమకి మోకరిల్లుతూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మైత్రి బ్యానర్లో హరీష్ శంకర్తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయబోతున్నాం’ అన్నారు. మరో అతిథి సుకుమార్ మాట్లాడుతూ ‘సినిమా చూశా. ఎంజాయ్మెంట్ తట్టుకోలేకపోయాను. నాని ఒక నటనాకాశం. ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఆవకాయను ఇష్టపడే ప్రతి ఫ్యామిలీకి ఈ సినిమా నచ్చుతుందన్నారు గోపీచంద్ మలినేని. ‘కడుపుబ్బ నవ్వించి, కన్నీళ్లు తెప్పించే మూవీ ఇది. పవన్ కళ్యాణ్తో నేను తీసే సినిమా కూడా మరో పదేళ్లు చెప్పుకునేలా ఉంటుంది’ అన్నారు హరీష్ శంకర్. నాని మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకొచ్చిన పద్నాలుగేళ్లలో ఆల్మోస్ట్ హీరోలందరినీ కలిశాను. కానీ కళ్యాణ్ గారిని కలవలేదు. అయినా చిన్నప్పట్నుంచీ పరిచయం ఉన్న ఫీలింగ్. మా టీమ్లో అందరికీ చాలా తిక్క ఉంది. దాని లెక్క రిలీజ్ తర్వాత కనబడుతుంది. ఆల్రెడీ సూపర్ హిట్టయిన వైబ్ వచ్చేసింది. ఇలాంటి సినిమా గెలవాలి. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు.. ఎంజాయ్మెంట్’ అన్నాడు. తనకీ చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది నజ్రియా. ‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి ప్రౌడ్గా ఫీలయ్యాం. టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం’ అని చెప్పాడు వివేక్ ఆత్రేయ. ‘ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే మూవీ. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్. నివేదా థామస్, రోహిణి, నదియా, నరేష్, ఆలగం పెరుమాళ్, అరుణ బిక్షు, డీవోపీ నికేత్, ఎడిటర్ రవితేజ గిరిజాల, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.