దర్శకుడు దాసరి నారాయణరావు కుమారులపై కేసు

దర్శకుడు దాసరి నారాయణరావు కుమారులపై కేసు
  • అప్పు అడిగితే చంపేస్తామని బెదిరించారంటూ కేసు నమోదు చేసిన జూబ్లిహిల్స్ పోలీసులు

హైదరాబాద్: అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామని భయపెట్టారంటూ ప్రముఖ సినీ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు. దాసరి నారాయణరావుతో ఆయన సన్నిహితంగా ఉండేవారు. అయితే దాసరి నారాయణరావు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పలు దఫాలుగా సోమశేఖరరావు వద్ద రూ.2.10 కోట్లు అప్పు తీసుకున్నారు. దాసరి మరణానంతరం పెద్దల సమక్షంలో ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్ 2018 నవంబరు 13వ తేదీన రూ.2.10 కోట్ల బదులు రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే డబ్బు ఇవ్వలేదు. దీంతో బాధితుడు సోమశేఖరరావు ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి నారాయణరావు నివాసానికి వెళ్లి దాసరి ప్రభు. దాసరి అరుణ్ లను డబ్బులు ఇవ్వమని అడిగారు. అప్పు చెల్లించమని అడిగినందుకు చెల్లించకపోగా.. మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు తనను భయపెట్టారంటూ బాధితుడి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.