ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్​ ఎందుకు మార్చారు..?

ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్​ ఎందుకు మార్చారు..?

దొంతిలో ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించిన రైతులు 
అలైన్​మెంట్ మార్పుపై ఆగ్రహం
తూప్రాన్ - నర్సాపూర్ రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి ఆందోళన 
రైతుపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని నిరసన 
నచ్చజెప్పినా వినకపోవడంతో వెనుదిరిగిన అధికారులు

 

రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్ ఆర్​)పై మెదక్​ జిల్లా దొంతిలో పొల్యూషన్ ​కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. శివ్వంపేట, నర్సాపూర్​, తూప్రాన్​ మండలాల నుంచి తరలివచ్చిన రైతులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ట్రిపుల్​ ఆర్​తో విలువైన భూములు పోతున్నాయని, అధికార పార్టీ నేతలకు మేలు చేసేందుకు కావాలనే రింగ్ రోడ్డు అలైన్​ మెంట్​ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెదక్ (శివ్వంపేట), వెలుగు : రీజినల్​ రింగ్​రోడ్డు (ట్రిపుల్ ఆర్​)కు సంబంధించి పొల్యూషన్​కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. అలైన్​మెంట్​మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఈ కార్యక్రమాన్నిఅడ్డుకున్నారు. రింగ్​రోడ్డు వద్దంటూ రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మండిపడ్డారు. రైతుల ఆందోళనతో దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అడుగడుగునా అడ్డంకులు ఎదురుకావడంతో అధికారులు అర్ధంతరంగా కార్యక్రమాన్ని ముగించి వెనుదిరిగారు. 

రోడ్డుపై ట్రిపుల్​ ఆర్​ ఫ్లెక్సీల దహనం

రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మెదక్ అడిషనల్​కలెక్టర్​రమేశ్​ఆధ్వర్యంలో శుక్రవారం శివ్వంపేట మండలం దొంతిలోని ఓ ప్రైవేట్​కన్వెన్షన్​సెంటర్​లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. రెవెన్యూతోపాటు, పొల్యూషన్​కంట్రోల్​బోర్డు అధికారులు, ఆర్ఆర్ఆర్​ప్రతినిధులు హాజరయ్యారు. శివ్వంపేట, నర్సాపూర్​, తూప్రాన్​ మండలాల నుంచి తరలివచ్చిన రైతులు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. ట్రిపుల్​ఆర్​తో తమ విలువైన భూములు పోతున్నాయని,  కొన్నిచోట్ల అధికార పార్టీ వారికి మేలు చేసేందుకు కావాలనే రింగ్ రోడ్డు అలైన్​ మెంట్​ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఎందుకు మార్చారో కారణం చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సమావేశాన్ని బహిష్కరించి తూప్రాన్ –నర్సాపూర్ రోడ్డుపై ముళ్ల కంచెలు అడ్డుగా వేసి రాస్తారోకో చేశారు. ట్రిపుల్​ఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను దహనం చేసి నిరసన తెలిపారు. 

ఎకరానికి 80 లక్షలు ఇవ్వాల్సిందే 

రైతులు మాట్లాడుతూ భూమికి భూమి ఇస్తేనే తమ భూములు అప్పగిస్తామని, లేకపోతే ప్రస్తుత మార్కెట్​వ్యాల్యూ ప్రకారం ఎకరాకు రూ.70 - నుంచి 80 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీంతో టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్​అక్కడికి వచ్చి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఫంక్షన్​హాల్​లో మీటింగ్ పెట్టకుండా రీజినల్​రింగ్​రోడ్డు వెళ్లే గ్రామాలకు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్నారు. పోలీసుల ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేయగా రైతులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనలో పాల్గొన్న కొంతన్​పల్లికి చెందిన రైతు పెద్ది వెంకటేశ్​పై ఓ ఎస్​ఐ చేయిచేసుకున్నాడంటూ‌‌ రైతులు పోలీసులకు ఎదురు తిరిగారు. దీంతో సదరు ఎస్​ఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటల పాటు రైతులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన కొనసాగించారు. అధికారులు, పోలీసులు ఎంత నచ్చ జెప్పినా వినిపించుకోకపోవడంతో అడిషనల్​ కలెక్టర్ రమేశ్ ​మీటింగ్ నుంచి  వెళ్లిపోయారు. 

ఉన్నభూమి పోతే ఎట్ల బతకాలె

మాకు రెండెకరాల భూమి ఉంది. దాని మీదే మా బతుకుదెరువు. ఉన్న భూమి రోడ్డుకు తీసుకుంటే మేం ఎట్లా బతకాలి? పైసలు ఇచ్చే బదులు భూమికి బదులు భూమి అయినా ఇవ్వాలి.

-  కమలమ్మ, రైతు, రత్నాపూర్​ 

ప్రాణం పోయినా భూమి ఇయ్యం

ముఖ్యమంత్రి కేసీఆర్​ భూమి లేనోళ్లకు భూమి ఇస్తమని చెప్పిండు. కానీ ఇప్పుడేమో పేద రైతుల నుంచి భూమి గుంజుకునుడేంది? మాకు నాలుగెకరాలు ఉంది. అంతా రింగ్​ రోడ్డులో పోతదంట. ఆ పొలం పోయినంక మేం బతికేం లాభం. ప్రాణం పోయినా సరే భూమి ఇచ్చేది లేదు.

-  యాదమ్మ, రైతు, పాంబండ