
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇతరులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్, హోం, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం వద్దే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిన నేపథ్యంలో.. వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ సహా ఇతర అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డిమొదటి నుంచీ ఫోకస్పెట్టారు. మున్సిపల్ శాఖను ఆయన అత్యంత కీలకంగా భావిస్తుండడంతో దానిని ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తి రేపుతున్నది. మరో ముఖ్యమైన హోం శాఖ కూడా ప్రస్తుతం సీఎం వద్దే ఉంది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కారు రేస్లాంటి కీలక కేసులు పెండింగ్లో ఉండడంతో.. ఈ శాఖను ఇంకొంతకాలం ఆయన దగ్గరే ఉంచుకోవచ్చని తెలుస్తున్నది. దీంతో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నవారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే చర్చ జోరుగా సాగుతున్నది. మంత్రుల సామాజిక వర్గాలు, వారి అనుభవం ఆధారంగా శాఖల కేటాయింపు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.