
హైదరాబాద్: ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్.. తెలంగాణ లోకి కూడా రావడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. బుధవారం రహేజా మైండ్ స్పేస్ లో పనిచేసే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి కూడా వైరస్ లక్షణాలున్నాయని వార్తలు రావడంతో ప్రజలు మరికొంచెం భయపడుతున్నారు. వైరస్ వారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉండే వారి నుండి దూరంగా ఉండేందుకు మాస్కులు వాడుతున్నారు.
అయితే ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు… రాష్ట్రంలో మాస్కుల ధరలను పెంచారు. కేవలం రూ.2 లకు దొరికే సాధారణ సర్జికల్ మాస్కులను రూ.10 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు. రూ.50 లకు దొరికే ఎన్95 మాస్కులు రూ.300లకు అమ్ముతున్నారు. వైరస్ కు దూరంగా ఉండాలంటే మాస్క్ ధరించడం తప్పని సరి కాబట్టి కొందరు పెరిగిన ధరల ప్రకారంగానే మాస్క్ లను కొంటున్నారు. కానీ సాధారణ ప్రజలకు మాత్రం రూ.2 ల మాస్కులను 8 రూపాయలు ఎక్కువగా చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు.