6న ఏపీ టెన్త్‌ ఫలితాల విడుదల

6న ఏపీ టెన్త్‌ ఫలితాల విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను జూన్ 6వ తేదీన (సోమ‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ప్రకటన విడుదల చేశారు. టెన్త్‌ ఫలితాలు జూన్ 4న (శనివారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విడుదల చేయాల్సి ఉంది. అయితే.. కొన్ని అనివార్య కారణాలతో ఈ ఫలితాలను విడుదల చేయలేకపోయినట్లు డైరెక్టర్‌ పేర్కొన్నారు.

ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించ‌నున్నారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ అధికారులు ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయ‌డం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. 

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఒక జీవో జారీ చేశారు. 
మరిన్ని వార్తల కోసం..

F3 'ఫన్'టాస్టిక్..రూ.100 కోట్ల సెలబ్రేషన్స్‌

వీరి కొట్లాటలోకి కొత్తగా మరొకరు