- పెరిగిన మహిళల వాటా
న్యూఢిల్లీ: కిందటేడాది డిసెంబర్ నాటికి దేశంలో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. ఇందులో 3.5 కోట్ల మంది వర్క్ కోసం చూస్తున్నారని, మరో 1.7 కోట్ల మంది వర్క్ కోసం యాక్టివ్గా చూడకపోయినప్పటికీ, వర్క్ ఉంటే చేయడానికి రెడీగా ఉన్నారని వివరించింది. ఇంకా నిరుద్యోగుల్లో మహిళలు పెరిగారని సీఎంఐఈ పేర్కొంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో ఉన్న 3.5 కోట్ల మందికి వెంటనే ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సంస్థ వివరించింది. ఉద్యోగాల కోసం వీరు యాక్టివ్గా వెతుకుతున్నారని పేర్కొంది. వీరిలో 80 లక్షల మంది మహిళలు ఉన్నారని తెలిపింది. ఈ 3.5 కోట్ల మందిలో మహిళ వాటా 23 శాతంగా ఉంది. మరోవైపు జాబ్స్ కోసం యాక్టివ్గా చూడకపోయినప్పటికీ, జాబ్ వస్తే చేయడానికి రెడీగా ఉన్న 1.7 కోట్ల మందికి కూడా ప్రభుత్వం ఉపాధిని కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. వీరిలో 90 లక్షల మంది మహిళలు ఉన్నారని, వీరి వాటా మొత్తం 1.7 కోట్ల మందిలో 53 శాతంగా ఉందని సీఎంఐఈ పేర్కొంది. వర్క్ కోసం ఇంత పెద్ద మొత్తంలో మహిళలు ఎందుకు అప్లయ్ చేసుకోవడం లేదో? ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సంస్థ పేర్కొంది. జాబ్స్ లేకపోవడం వలనా? లేదా సోషల్గా సపోర్ట్ లేకపోవడం వలనా? మహిళలు వర్క్ ఫోర్స్లో జాయిన్ కావడం లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గ్లోబల్గా ఎంప్లాయ్మెంట్ రేటు 2020 లో 55 శాతంగా ఉందని సీఎంఐఈ పేర్కొంది. 2019 లో ఈ రేటు 58 శాతంగా ఉందని తెలిపింది. అదే ఇండియాలో అయితే 2019 లో ఎంప్లాయ్మెంట్ రేటు 43 %, 2020 లో 38 శాతంగా ఉందని తెలిపింది. దేశ అన్ఎంప్లాయ్మెంట్ రేటును చూస్తే నిరుద్యోగుల గురించి పూర్తిగా తెలియడం లేదని, దేశంలో ఎంప్లాయ్మెంట్ రేటే తక్కువగా ఉండడమే కారణమని సీఎంఐఈ పేర్కొంది. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ను చేరుకోవడానికి దేశంలో అదనంగా 18.75 కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.