
‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. శ్రీలీల హీరోయిన్. గౌతమి, అశుతోష్ రాణా, నవాబ్ షా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన టీమ్.. తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో.. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్తో పాటు వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే కొంతమంది పిల్లలతో కామెడీ సీన్స్, శ్రీలీలతో రొమాంటిక్ సీన్స్, పోలీస్ స్టేషన్ సెట్లో మరికొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు.
ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. మరోవైపు ‘సాహో’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో పవన్ నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం శనివారం ముంబైలో షూటింగ్ మొదలైంది. వచ్చే వారం నుంచి పవన్ కళ్యాణ్ ఈ మూవీ సెట్స్లో జాయిన్ కానున్నారని టీమ్ తెలియజేసింది. ‘నిప్పు తుపాను వస్తోంది’ అంటూ ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోని బట్టి.. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని అర్ధమవుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.