నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్‌

నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్‌

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ మంగళవారం (సెప్టెంబర్ 26న) సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం (సెప్టెంబర్ 23న) సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు.

సోమవారం (సెప్టెంబర్ 25న) ఈ కేసును చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు.  సీజేఐ స్పందిస్తూ రేపు (మంగళవారం) రండి అని సూచించారు. ఎప్పటి నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారని ప్రశ్నించారు. బాబును సెప్టెంబర్ 8వ తేదీన అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. సీజేఐ సెప్టెంబర్‌ 8 నుంచా అని ప్రశ్నిస్తూ రేపటి మెన్షనింగ్‌లో రండి, ఏం చేయాలన్నది చూస్తాం అంటూ విచారణను ముగించారు.