చదువుకు బీహార్​ కన్నాతక్కువ నిధులా?

చదువుకు బీహార్​ కన్నాతక్కువ నిధులా?
  • సర్కారు ప్రాధాన్యం ఏంటో ఇక్కడే తెలుస్తోంది: దత్తా త్రేయ
  • టీపీయూఎస్ ఆధ్వర్యంలో టీచర్ల నిరాహార దీక్ష

చదువు కోసం రాష్ట్ర సర్కార్​ ఇచ్చిన బడ్జెట్​ మన కన్నా వెనకబడిన బీహార్​ కేటాయించిన బడ్జెట్​ కన్నా తక్కువుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సర్కారు 10,560 కోట్లు కేటాయిస్తే, బీహార్​ మనకన్నా ఎక్కువగా 16,740 కోట్లు ఇచ్చిందని అన్నారు. సర్కారు చదువుకు ఎంత ప్రాధాన్యం ఇస్తోందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్​) ఆధ్వర్యంలో టీచర్లు హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద సామూహిక నిరాహారదీక్షకు దిగారు. ఈ దీక్షకు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు, ఎమ్మెల్యే రాజాసింగ్​ సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్​కు కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఎంత ఖర్చు పెట్టిందో శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్​ చేశారు. విద్యారంగం పూర్తిగా సమస్యలతో నిండిపోయిందని రాంచందర్​రావు విమర్శించారు. శాసనమండలి సమావేశాల్లో టీచర్ల సమస్యలను ఎత్తిచూపినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి సర్వీస్​ రూల్స్​పై కేంద్రం ఆర్డినెన్స్​ ఇచ్చినా సర్కార్​ అమలు చేయకపోవడం దురదృష్టకర మన్నారు. సీఎం కేసీఆర్​ రాత్రంతా కొబ్బరినీళ్లు తాగుతారని, అందుకే పొద్దుగాల పడుకుంటారని రాజాసింగ్​ ఎద్దేవా చేశారు. ఇకనైనా ఆయన మేల్కొంటే బాగుంటుందన్నారు. గతంలో ప్రజలు సీఎంలను కలిసి సమస్యలు చెప్పుకునేవారని, ఇప్పుడైతే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకూ అవకాశం లేకుండాపోయిందని అన్నారు. అందుకే ధర్నాచౌక్​ వద్ద ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.