హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంతవరకు పోయిందో తెలుసుకునేందుకు ఓ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, హెల్త్ స్టాఫ్, పోలీసులు, శానిటేషన్ వర్కర్స్, జర్నలిస్టులకు యాంటీబాడీ టెస్టులు చేయించాలని భావిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాగే వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి కూడా ఈ టెస్టులు చేయించే చాన్స్ ఉందన్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్, కామారెడ్డి, నల్గొండ, జనగాం జిల్లాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సైంటిస్టులు ఓ సర్వే చేశారు. 1,700 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వీటి రిజల్ట్స్ను ఈ వారంలోనే ఐసీఎంఆర్ విడుదల చేయనుంది.
ఉపయోగమేంది..?
వైరస్ వ్యాప్తిని తెలుసుకునేందుకు సీరో సర్వే చేయాలని ఇటీవల అన్ని రాష్ట్రాలకూ ఐసీఎంఆర్ లేఖ రాసింది. ఇందులో భాగంగా ఎలీసా మెథడ్లో ఐజీజీ యాంటీబాడీ టెస్టులు చేయాలని సూచించింది. ఈ మెథడ్లో రక్తంలోని సీరమ్ను టెస్టు చేస్తారు. అందుకే దీన్ని సీరాలాజికల్ టెస్ట్ అంటారు. మన శరీరంలోకి వైరస్ ఎంటరైతే, దాన్ని ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఇందుకు వారం రోజులు పడుతుంది. ఎలిసా ఐజీఎం యాంటీబాడీ టెస్టులో వీటిని గుర్తించొచ్చు. అదే.. వైరస్ ఎంటరయ్యాక రెండు వారాలకు ఉత్పత్పయ్యే యాంటీబాడీస్ను ఎలీసా ఐజీజీ టెస్ట్ ద్వారా గుర్తించొచ్చు. ఐజీజీ యాంటీబాడీస్ టెస్టులో పాజిటివ్ వస్తే వైరస్ తగ్గిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో సర్వేలో భాగంగా చేయబోయేవి ఐజీజీ మెథడ్ టెస్టులేనని ఆఫీసర్లు చెబుతున్నారు.
సెల్ఫ్ లాక్ డౌన్ మనల్ని కాపాడుతుంది