న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పెళ్లిళ్లకు చట్టబద్ధమైన గుర్తింపును కల్పించాలని కోరుతూ వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను కలగలిపి సుప్రీంకోర్టు ఇవాళ తనకే బదిలీ చేసుకుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ జె.బి.పార్దీవాలాలతో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లు అన్నింటిపైనా ఫిబ్రవరి 15లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్లపై తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. పిటిషనర్లలో ఎవరైనా నేరుగా హాజరయ్యే పరిస్థితి లేకుంటే.. వర్చువల్ ప్లాట్ఫామ్ ద్వారా వాదనలు వినిపించవచ్చని బెంచ్ సూచించింది.
ఒక్కచోటే విచారించాలి..
అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్ల అంశంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో ఇదే అంశంపై పిటిషన్ పెండింగ్లో ఉన్నందున.. అక్కడ తీర్పు వచ్చేవరకు వేచి చూడటం లేదా అటువంటి అన్ని పిటిషన్లను కలిపి తనకే బదిలీ చేసుకోవడం అని చెప్పారు. సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ ఒక పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టులోనే వాదనలు వినాలని సూచించారు.
హైదరాబాదీ గే జంట పిటిషన్ కూడా..
ఈ అంశంపై దాఖలైన పిటిషన్లలో హైదరాబాద్లో నివసించే స్వలింగ సంపర్క జంట సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఒకటి. ‘‘మేమిద్దరం గత పదేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. అందరిలా మేం కూడా తొమ్మిదో వివాహ వార్షికోత్సవాన్ని చేసుకోలేకపోయాం. మా హక్కులను కాలరాశారు. వివాహానికి చట్టబద్దత లేకపోవడం వల్లే ఇలా జరిగింది” అని పిటిషన్ లో వారు ఆరోపించారు.