ఢిల్లీలో నో ఓలా, నో ఉబర్, నో ర్యాపిడో..

ఢిల్లీలో నో ఓలా, నో ఉబర్, నో ర్యాపిడో..

దేశ రాజధాని ఢిల్లీలో బైక్ -టాక్సీలను నడపడానికి అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై భారత సుప్రీంకోర్టు సోమవారం (జూన్ 12న) స్టే విధించింది. బైక్ -టాక్సీ అగ్రిగేటర్లు, రాపిడో, ఉబర్‌లు ఢిల్లీలో పని చేయడానికి అనుమతించే హైకోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. తుది విధానాన్ని రూపొందించే వరకు ఢిల్లీ రోడ్లపై బైక్ -టాక్సీలు నడపరాదని తీర్పును ప్రకటిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది.

అయితే.. ఈ అంశాన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన వెకేషన్ బెంచ్, ఢిల్లీ హైకోర్టు ద్వారా తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించమని అభ్యర్థించడానికి ఇద్దరు అగ్రిగేటర్‌లకు స్వేచ్ఛను మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయంలో తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-టాక్సీ అగ్రిగేటర్ లపై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మనీష్ వశిష్ట్ వాదిస్తూ.. తుది విధానాన్ని ప్రకటించే వరకు ప్రభుత్వ నోటీసుపై స్టే విధించాలన్న హైకోర్టు నిర్ణయం రాపిడో రిట్ పిటిషన్‌ను వాస్తవంగా అనుమతించినట్లేనని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో, బైక్-టాక్సీలను ఢిల్లీలో నడపకుండా హెచ్చరించింది. ఉల్లంఘనలకు అగ్రిగేటర్లకు రూ. 1 లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్‌ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. 

అంతేకాదు.. రైడింగ్‌ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్‌ లైసెన్స్‌ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్‌ షేరింగ్‌ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్‌ షేరింగ్‌ టూ వీలర్‌ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్‌ షేరింగ్‌ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.