
రూ. 500 కోట్లతో సరిపెట్టిన రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు : రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)కు బడ్జెట్ లో రాష్ట్ర సర్కారు రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. నిరుడు కూడా ఇంతే కేటాయించగా.. ఇంత వరకు అందులోంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రెండు మార్గాల్లో నిర్మించనున్న ఆర్ఆర్ఆర్కు భూసేకరణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని ఎన్ హెచ్ఏఐ ( నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ) అకౌంట్ లో డిపాజిట్ చేయాల్సి ఉంది. నిధులు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదుసార్లు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖ రాసినా స్పందన లేదు. వెంటనే నిధులు డిపాజిట్ చేయాలని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆర్ఆర్ఆర్ పనుల కాలవ్యవధి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 50 శాతం భూసేకరణ వ్యయాన్ని డిపాజిట్ చేయడంపై ఆధారపడి ఉంటుందని నాలుగు రోజుల కింద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ ప్రాజెక్టు అయిన సంగారెడ్డి- – గజ్వేల్-– భువనగిరి –-చౌటుప్పల్ రోడ్డును భారత్మాల మొదటి దశలో చేర్చామని గడ్కరీ గుర్తుచేశారు.
రూ. 12 వేల కోట్లతో ప్రాజెక్టు
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రెండు మార్గాల్లో 340 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ ను సుమారు రూ.12 వేల కోట్లతో చేపట్టాలని గతంలో నిర్ణయించారు. నార్త్ పార్ట్ సంగారెడ్డి – గజ్వేల్– భువనగిరి– చౌటప్పల్ వరకు 158 కిలోమీటర్లు, సౌత్ పార్ట్ చౌటుప్పల్– ఇబ్రహీంపట్నం – కందకూరు–చేవేళ్ల –శంకర్ పల్లి– సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లు చేపడుతున్నారు. సౌత్ పార్ట్ డీపీఆర్ రెడీ అవుతున్నదని పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నార్త్ పార్ట్ లో రైతులతో పబ్లిక్ హియరింగ్ లు, అభ్యంతరాల స్వీకరణ ప్రాసెస్ పూర్తయింది. దీనికి త్వరలో ఏ సర్వే నంబర్ లో ఎంత భూమి ప్రాజెక్టుకు పోతుందని.. ఎంత మంది రైతులు ఉన్నారు.. వంటి వివరాలతో 3 డీ నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వాటా రిలీజ్ చేస్తే భూమి కోల్పోయే రైతుల ఖాతాల్లోకి పరిహారం చేరుతుంది. రెండు పార్ట్ లు కలిపి భూసేకరణకు సుమారు రూ.4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.