కిరాణా, పాన్‌ షాపుల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నరు

కిరాణా, పాన్‌ షాపుల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నరు

నల్గొండ జిల్లా: దుండగులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శుక్రవారం ఆయన  నల్గొండ జిల్లాలోని ముషంపల్లిలో బాధిత కుటుంబానికి లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం సరికాదన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రంలో రోజుకో ఇలాంటి సంఘటన జరుగుతుంటే దేశంలో అత్యంత సమర్థవంతమైన తెలంగాణ పోలీస్ అంటున్న సీఎం, దీనికి  ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో కిరాణా, పాన్ షాపులలో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.

ఎమ్మెల్యేలకు నాలుగు ఎస్కార్ట్ వాహనాలు ఎందుకు, ఇద్దరు గన్‌ మెన్లు చాలన్నారు. ఉన్న పోలీసులంతా ఎమ్మెల్యేల రక్షణకే పోతే ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మద్యంపై ఆదాయం 10 వేల కోట్లు, ప్రస్తుతం 40 వేల కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. బెల్ట్ షాపుల్లో మందు అమ్మితే అంతకుముందు వారిని పట్టుకొని ప్రభుత్వం శిక్షించేదన్నారు. ఈ ప్రభుత్వంలో బెల్టుషాపులను ప్రోత్సహించి మద్యం ఏరులై పారే విధంగా ప్రోత్సహిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు.