వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియ నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియ నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

రాష్ట్రంలో వీఆర్‌ఏల సర్దుబాటును తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. జులై 24న జీవోకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేస్తూ ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

దానికి అనుగుణంగా రెవెన్యూ శాఖ జులై 24న జీవో 81, ఆర్థిక శాఖ ఆగస్టు 3న జీవో 85 జారీ చేశాయి. ఇతర శాఖల్లోకి నియమిస్తూ ఆగస్టు 3న సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 61ఏళ్లలోపు వయసున్న 16 వేల 758 మంది వీఆర్‌ఏలను వారి విద్యార్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో లోయర్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగ విరమణ వయసు దాటిన మరో 3 వేల 797 మంది వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. చట్టాలు, సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందని, తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని పలువురు వీఆర్‌ఏలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 10న హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల వాదనతో  ఏకీభవించిన హైకోర్టు.. జీవోలను సస్పెండ్ చేస్తూ జులై 24కి ముందు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.