లాక్ డౌన్ మూడో ఫేజ్.. సర్కార్ కు, జనానికి సవాలే

లాక్ డౌన్ మూడో ఫేజ్.. సర్కార్ కు, జనానికి సవాలే
  • రెండో ఫేజ్​లో భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
  • దేశంలో 42 వేలు దాటిన కేసులు.. 1,391 మంది మృతి
  • ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,676 మందికి పాజిటివ్
  • అయినా జనం ఇబ్బందులను చూసి సడలింపులిచ్చిన సర్కార్​
  • ప్రజలూ బాధ్యతగా ఉండాల్సిందే అంటున్న డాక్టర్లు

మూడో లాక్​డౌన్​ సోమవారం మొదలైంది.. కరోనాపై పోరాటంలో కొత్త ఫేజ్​ ఇది.. అయితే ఈ దశ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా పెద్ద చాలెంజ్. చాకచక్యంగా ఎదుర్కోవాల్సిన చాలెంజ్​. మొదట్లో పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో వందల్లో కేసులు.. ఇప్పుడు వేలు. అయినా సరే ప్రజలు పడుతున్న ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని సర్కార్​ ​కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా బయటకు వచ్చే జనం రూల్స్​ పాటించేలా చూస్తూ… కరోనానూ కంట్రోల్​ చేయాల్సిన చాలెంజ్​ ప్రభుత్వానిది. 40 రోజులు ఇండ్లలోనే గడిపి మళ్లీ స్వేచ్చా ప్రపంచంలోకి వస్తున్న ప్రజలకు కూడా ఇది చాలెంజే. ఒక పక్క పనులు చేసుకుంటూనే మరోపక్క కరోనా అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైమ్​ ఇది.

న్యూఢిల్లీకరోనా మన దేశంలో ఎంటరైన రోజుకూ ఈ రోజుకూ చాలా తేడా ఉంది. రెండు లాక్​డౌన్​లు పెట్టినా కూడా వైరస్​ విస్తరిస్తూనే ఉంది. ఫస్ట్​ లాక్​డౌన్​ ప్రకటించినప్పుడు దేశంలో కరోనా కేసులు అంతగా లేవు. లాక్​డౌన్​ మొదలైన మార్చి 25వ తేదీ నాటికి నమోదైన మొత్తం కేసులు 657, మరణాలు 11. ఫస్ట్​ ఫేజ్​ పూర్తయిన ఏప్రిల్​ 14 నాటికి 21 రోజుల్లో కేసుల సంఖ్య 11,485,  మరణాలు 396కి పెరిగింది. ఈ టైంలో రోజూ సగటున 515 కేసుల చొప్పున మొత్తం 10,914 కేసులు, సగటున 18 మరణాలతో 386 మరణాలు రికార్డయ్యాయి.  సెకండ్​లాక్​డౌన్​ మొదలైన ఏప్రిల్​ 15న 12,371 కేసులున్నాయి. అది పూర్తయ్యే నాటికి ఈ 19 రోజుల్లో కేసులు భారీగా పెరిగిపోయాయి. 42,505 మంది కరోనా బారినపడ్డారు. ఈ టైంలో 31,020 మందికి పాజిటివ్​ వచ్చింది. సగటున రోజూ 1,632 కేసులు నమోదయ్యాయంటేనే సెకండ్​ ఫేజ్​లో పరిస్థితి ఎంత సీరియస్​గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సెకండ్​ లాక్​డౌన్​ మొదలైన తర్వాతి రోజు నుంచి రోజూ వెయ్యికిపైగానే కేసులు నమోదయ్యాయి. ఈ రెండు మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రోజూ 2 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. ఇలాంటి టైంలోనే కేంద్ర ప్రభుత్వం మూడో లాక్​డౌన్​ను ప్రకటించింది. అదే టైంలో ఎకానమీని, సామాన్యుడి బతుకును గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో కొన్ని సడలింపులూ ఇచ్చింది. అది మంచి నిర్ణయమే అయినా కేసులు పెరుగుతున్న ఈ టైంలోనే సడలింపులివ్వడమన్నది అటు ప్రభుత్వానికి, ఇటు జనానికి అసలు సిసలైన సవాల్​. దానిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అలాగని మొత్తం బాధ్యత ప్రభుత్వం మీదే వదిలేయడం కరెక్ట్​ కాదు. జనాలు బాధ్యతగా ఉండి కరోనా కట్టడికి తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ముంబై, పుణేల్లో సడలింపుల్లేవ్​

గ్రీన్​, ఆరెంజ్​ జోన్లలో మహారాష్ట్ర సర్కార్​ సడలింపులస్తోంది. లిక్కర్​ షాపులు, నాన్​ ఎసెన్షియల్​ సామాన్లు అమ్ముకునేందుకు ఓకే చెప్పింది. కొన్ని రెడ్​ జోన్​ జిల్లాల్లోని నాన్​కంటెయిన్​మెంట్​ ఏరియాల్లో కూడా అన్ని పనులు చేసుకోవచ్చని సర్కార్​ ఉత్తర్వులిచ్చింది. అయితే, పరిస్థితి తీవ్రంగా ఉన్నా ముంబై, పుణేల్లో  మాత్రం ఎలాంటి సడలింపులుండవని తేల్చి చెప్పింది. నిత్యావసరాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఇళ్లలో పనిచేసే వాళ్లకూ అనుమతి ఉండబోదని చెప్పింది.

గుజరాత్​లో కఠినంగానే

రెడ్​జోన్లలోనూ అవసరమైన మేరకు సడలింపులివ్వొచ్చని కేంద్ర సర్కార్​ సూచించినా, గుజరాత్​ మాత్రం నో అంటోంది. హాట్​స్పాట్లుగా మారిన ఆరు సిటీల్లో ఎలాంటి మినహాయింపులుండబోవని తేల్చి చెప్పింది. రెడ్​ జోన్లలోని అహ్మదాబాద్​, సూరత్​, వడోదర, గాంధీనగర్​, భావ్​నగర్​, ఆరెంజ్​ జోన్​లో ఉన్న రాజ్​కోట్​లలో సడలింపులుండవని సీఎం విజయ్​రూపానీ ప్రకటించారు. రెండు వారాల పాటు ఇప్పుడున్న రూల్సే వర్తిస్తాయన్నారు.

లిక్కర్​ షాపులు ఓపెన్​

నాన్​కంటెయిన్​మెంట్​ జోన్లలో లిక్కర్​ షాపులను ఓపెన్​ చేసేందుకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఉత్తర్​ప్రదేశ్​, హర్యానా, రాజస్థాన్​, కర్నాటక, ఈశాన్య రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. నాన్​కంటెయిన్​మెంట్​ జోన్లలోని స్వతంత్రంగా ఉన్న లిక్కర్​ షాపుల వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను కర్నాటక సర్కార్​ ఆదేశించింది. కేంద్ర సర్కారు గైడ్​లైన్స్​కు తగ్గట్టు ఇప్పటికే అక్కడ షాపు ఓనర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యూపీలో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల దాకా వైన్​ షాపులు తెరవొచ్చని హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అమ్మకూడదని పేర్కొంది. ఏపీ కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు టైం పెట్టింది. ధరలను 25% పెంచింది. హర్యానా కూడా మందుపై ‘కొవిడ్​ సెస్​’ వేయాలని నిర్ణయించింది. కరోనాతో సతమతమవుతున్న ప్రాంతాలకు అండగా నిలిచేందుకు ఈ సెస్​ వేయాలనుకుంటున్నట్టు రాష్ట్ర డిప్యూటీ సీఎం దుశ్యంత్​ చౌతాలా తెలిపారు. లిక్కర్​ షాపులకు ఓకే చెప్పిన రాజస్థాన్​ సర్కార్​, పాన్​, గుట్కా, టొబాకో ఉత్పత్తులపై మాత్రం రాష్ట్రమంతటా నిషేధం విధించింది.

మరణాల రేటులో మనం బెటరే

మరణాల రేటు విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం చాలా మంచి పొజిషన్​లోనే ఉన్నాం. ఇండియాలో డెత్​ రేట్​ కేవలం 3.3 శాతమే. కేసులను బాగా కట్టడి చేయగలిగిన సౌత్​కొరియాలో 2.3 శాతంగా ఉంది. రష్యాలో డెత్​ రేట్​ ఒక శాతమే అయినా, కేసులు ఎక్కువగా ఉండడంతో మరణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ జాబితాలో 15.7 శాతంతో బెల్జియం ఫస్ట్​ ప్లేస్​లో ఉండగా, 15.4 శాతంతో బ్రిటన్​ రెండో ప్లేస్​లో ఉంది. ఫ్రాన్స్​లో 14.7%, ఇటలీల 13.6, స్పెయిన్​ 11.5, అమెరికా 5.9, చైనాలో 5.5 శాతంగా డెత్​రేట్​ ఉంది.

ప్రభుత్వం ఏం చేయాలి?

లాక్​డౌన్​ 3లో సర్కార్​ సడలింపులు ఇచ్చినా దానికి తగ్గట్టు కఠినమైన రూల్స్​ పెట్టింది కేంద్ర సర్కార్​. వాటి అమలు జనాలు, కంపెనీల చేతుల్లోనే ఉంది. అయినా సర్కార్​ చేయాల్సిన పనులూ ఇంకొన్ని ఉన్నాయి.

  •    టెస్టుల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచాలి.
  •    కరోనా పాజిటివ్​ వ్యక్తులను కలిసినోళ్లను గుర్తించాలి.
  •    ట్రీట్​మెంట్​కు ఆస్పత్రుల్లో అవసరమైన వసతులు కల్పించాలి.
  •    కరోనా లక్షణాలున్నవాళ్లలో భయం పోగొట్టి భరోసా పెంచాలి.
  •    రాకపోకలపై వీలైనంత వరకు ఆంక్షలు పెట్టాలి.
  •    వలస కూలీల తరలింపులో జాగ్రత్తలు పాటించాలి.
  •    హాట్​స్పాట్లు, కంటెయిన్​మెంట్​ జోన్లలో నిఘాను కట్టుదిట్టం చేయాలి.
  •    సామాన్య జనానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి.
  •    కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
  •    వీధులు, రోడ్లు, ఆఫీసులను ఎప్పటికప్పుడు శానిటైజ్​ చేస్తుండాలి.
  •    కరోనా మందులు, వ్యాక్సిన్ల అభివృద్ధిపై ఫోకస్​ పెట్టాలి.

మనం ఏం చేయాలి?

  •    లాక్​డౌన్​ సడలింపులు వచ్చాయి కదా అని ఎక్కువగా బయటకు రావొద్దు.
  •    అవసరమైతేనే బయటకు రావాలి. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండడం మంచిది.
  •    బయటకు వచ్చినప్పుడు ఎడమెడం ఉండాలి.
  •    సర్కార్​ పెట్టిన రూల్స్​ను తప్పకుండా పాటించాలి.
  •    మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి.
  •    ఆఫీసుల్లో ఫిజికల్​ డిస్టెన్స్​ను పాటించాలి. తరచూ చేతులను కడుక్కోవాలి.
  •    పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
  •    కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే భయపడకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండాలి.
  •    కరోనా సోకినోళ్లను నేరస్తులుగా చూడొద్దు. వాళ్లకు అండగా ఉండాలి.
  •    ఆరోగ్యవంతమైన ఫుడ్డు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పెరిగేందుకు విటమిన్​ సీ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.
  •    వైన్​ షాపుల దగ్గర దూరం పాటించాలి. షాపు దగ్గర ఐదుగురుంటే కొంచెం దూరంగా నిలబడాలి. వాళ్ల వంతు అయిపోయేదాకా వేచి చూడాలి. వీలైతే మందు ముట్టుకోకుండా ఉండడమే మంచిది.