- 1,800 కాలనీల్లో ఎల్ఆర్ఎస్ అమలు
- ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
- నాన్ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులు పెట్టే వెసులుబాటు
- కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో అక్రమంగా కట్టుకున్న లక్షలాది ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. సుమారు 1,800 కాలనీల్లో ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని.. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 50 లక్షల మందికి లబ్ధిచేకూరుతుందని ప్రకటించింది. ఇక గోధుమ, శనగపప్పు, కందిపప్పు తదితర ఆరు పంటలకు మద్దతు ధరలను పెంచింది. పెట్రోలియం ఉత్పత్తులను అమ్ముకోవడానికి నాన్-ఆయిల్ కంపెనీలను అనుమతించాలని నిర్ణయించింది.
బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం జరిగింది.
అందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, హర్దీప్ పురి మీడియాకు వెల్లడించారు.
త్వరలోనే రెగ్యులరైజేషన్..
ఢిల్లీలో అనధికార కాలనీల రెగ్యులరైజేషన్ ప్రక్రియను అతి త్వరలోనే మొదలుపెడతామని హర్దీప్ సింగ్పురి తెలిపారు. నవంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును పెడతామన్నారు.
లక్షల మంది పేదల జీవితాలను ప్రభావితం చేసే ఈ ప్రక్రియను చేపట్టడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైనందుకే కేంద్రం రంగంలోకి దిగిందన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం కీలకంగా మారింది. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వాగతించారు.
అక్రమ కాలనీల రెగ్యులరైజేషన్పై కిందటి జులైలోనే తాము ప్రపోజల్స్ పంపామని, వాటినే కేంద్రం ఆమోదించిందని ఆయన చెప్పుకొచ్చారు.
రైతులకు మేలు చేస్తం..
గోధుమ, శనగ పప్పు, కంది పప్పు, ఆవాలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని 50 శాతం నుంచి 109 శాతానికి పెంచుతున్నట్టు ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. గోధుమ ధరను క్వింటాకు రూ.85, బార్లీ ధర రూ.85, శనగ ధర రూ.255, మైసూర్ పప్పు ధర రూ.325, ఆవాల ధరను క్వింటాకు రూ.225కు పెంచుతున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ రంగం క్రైసిస్లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం రైతులకు మేలు చేస్తుందని, 2022 నాటికి రైతుల సంపదను రెట్టింపు చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
నాన్ ఆయిల్ కంపెనీలూ పెట్రోలియం అమ్ముకోవచ్చు
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ అమ్మకాలకు సంబంధించి నిబంధనలను సడలిస్తున్నట్టు జవదేకర్ చెప్పారు. ఇప్పటిదాకా పెట్రోలియంను ఉత్పత్తి చేసే ఆయిల్ కంపెనీలకు మాత్రమే దాన్ని రిటైల్గా అమ్ముకునేందుకు అనుమతి ఉంది. ఇకపై ఏటా రూ.250 కోట్లపైబడి టర్నోవర్ ఉన్న ఏ కంపెనీ అయినా రిటైల్ విధానంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ను అమ్ముకోవచ్చని జవదేకర్ తెలిపారు. కొత్త వాటిలో 15% బంకుల్ని రూరల్ ఏరియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయిల్ రిటైలింగ్ రంగంలో పెట్టుబడులు, కంపెనీల మధ్య కాంపిటీషన్ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.