హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్ల శాఖ, కమర్షియల్ ట్యాక్స్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. వివిధ కేటగిరీల్లో రిజిస్ట్రేషన్ల శాఖలో 364 పోస్టులు, కమర్షియల్ ట్యాక్స్లో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 1,302 మంది ఉద్యోగుల అవసరం ఉంది. కానీ, 938 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 364 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సబ్రిజిస్ట్రార్/సూపరింటెండెంట్–2 పోస్టులు 30, జూనియర్ అసిస్టెంట్ 158, షరాఫ్ 65, ఆఫీస్ సబార్డినేట్ 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఆఫీసులో 11 నుంచి 15 మధ్య ఉద్యోగులు కావాల్సి ఉన్నా కేవలం నలుగురైదుగురే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులను తొలగించడంతో ఆ సంఖ్య ముగ్గురికి పడిపోయింది. రోజూ వందలాది దరఖాస్తులు వస్తుండడంతో కొందరు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను రిజిస్ట్రార్లు నియమించుకున్నారు. వాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. మే 30న యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నలుగురు సిబ్బందే ఉన్నా ఐదు నెలల్లోనే 16,600 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించారు. దీంతో ప్రైవేట్ వ్యక్తులను తీసుకోవద్దంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చిరంజీవులుకు ఏసీబీ సూచించింది. వెంటనే వాళ్లను తీసేయాల్సిందిగా జూన్ 1న చిరంజీవులు రిజిస్ట్రార్లకు ఉత్తర్వులిచ్చారు.
కమర్షియల్ ట్యాక్స్లో 250 ఖాళీలు
ఏటా కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం, రిటర్న్స్ పెరుగుతున్నా అందుకు తగ్గట్టు సిబ్బందిని మాత్రం నియమించట్లేదు. ప్రస్తుతం 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్ నుంచి కమిషనర్ వరకు 1674 మంది ఉద్యోగులున్నారు. జీఎస్టీ వచ్చాక ఉన్న ఉద్యోగులపైనే అదనపు పనిభారం పడింది. దీంతో 3500 నుంచి 4 వేల వరకు సిబ్బంది సంఖ్యను పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతి సర్కిల్లో 8 నుంచి 10 మంది మాత్రమే ఉండగా ఆ సంఖ్యను 20 నుంచి 30కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్కు బదిలీ అయిన ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 30 శాతం ఇవ్వాల్సి ఉండగా, 12 నుంచి 14 శాతం మాత్రమే ఇస్తున్నారు.