కల్తీ కల్లు ఇష్యూపై హైడ్రామా

కల్తీ కల్లు ఇష్యూపై హైడ్రామా
  • కల్తీ కల్లు ఇష్యూపై హైడ్రామా
  • హాస్పిటల్​లోనే బాధితులు
  • మూడుకు చేరిన మరణాలు
  • హాస్పిటల్​ను సందర్శించిన అధికార, ప్రతిపక్షాల లీడర్లు

మహబూబ్​నగర్, వెలుగు : కల్తీకల్లు ఇష్యూపై ఆరు రోజులుగా పాలమూరులో ఎవరూ సప్పుడు చేయలేదు. ఆదివారం ఆశన్న, బుధవారం విష్ణు ప్రకాశ్​, రేణుక మృతి చెందడం, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్​లో హైడ్రామా నడిచింది.

పోటాపోటీగా ప్రెస్​మీట్లు, పరామర్శలు

కల్తీకల్లు ఎఫెక్ట్​తో ముగ్గురు చనిపోవడంతో అపోజిషన్​పార్టీలు అలర్టయ్యాయి. బుధవారం పీసీసీ జనరల్ సెక్రటరీ ఎస్.వినోద్​కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి వేర్వేరుగా ప్రెస్​మీట్​నిర్వహించారు. అనంతరం బీజేపీ లీడర్లు జనరల్ హాస్పిటల్​ను విజిట్​చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎక్సైజ్​శాఖా మంత్రి వి. శ్రీనివాస్​గౌడ్​ హాస్పిటల్​ను విజిట్​చేసి, అక్కడే విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సైతం సాయంత్రం ప్రెస్​మీట్​లో మాట్లాడారు.

హాస్పిటల్​లోనే బాధితులకు సెటిల్మెంట్​

కల్తీకల్లు విషయం బయటకు రాకుండా హాస్పిటల్​లోనే బాధితులకు ఆదివారం సెటిల్మెంట్​ చేసినట్లు తెలిసింది. ముందుగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇచ్చారని సమాచారం. డిశ్చార్జ్​​అయ్యాక పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్తామని హామీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఆదివారం ఆశన్న అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన కుటుంబానికి సెటిల్మెంట్​చేసినట్లు తెలిసింది. ఈయన పేరు మీద పొలం ఉండటంతో.. కల్తీకల్లు తాగి చనిపోతే 'రైతుబీమా' రాదని ఓ మధ్యవర్తి భయపెట్టించి అంత్యక్రియల కోసం రూ.30 వేలు ఇచ్చి కేసును డైవర్ట్​ చేసినట్లు సమాచారం. 

ఎవరికీ ఇన్ఫర్మేషన్​ ఇవ్వొద్దని ఆర్డర్లు..

శుక్రవారం నుంచి బాధితులు హాస్పిటల్​కు వస్తున్నా సమాచారం బయటకు రావడం లేదు. ఈ విషయంపై ఆసుపత్రి వర్గాలకు స్ట్రిక్ట్​ ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం. దీంతో వారు ఇన్ఫర్మేషన్​ను బయటకు చెప్పడం లేదు. బాధితులు ఎవరెవరూ ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అస్వస్థతకు కారణాలేంటి? అనే విషయాలను సీక్రెట్​గా ఉంచుతున్నారు. వారిని అడ్మిట్ చేసిన తర్వాత కేస్​షీట్లలో కల్తీకల్లు తాగడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నానే విషయాన్ని ప్రస్తవించారు. కానీ, బయటకు మాత్రం డీ హైడ్రేషన్​ వల్ల ఇలా చేస్తున్నారని ప్రకటిస్తున్నారు.

రిజల్ట్​ఎప్పుడొస్తదో?

కల్తీ కల్లు వ్యవహారంపై సోమవారం ఎక్సైజ్​ఆఫీసర్లు విలేకర్ల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. అయిదు షాపుల్లో శ్యాంపిల్స్​  సేకరించామని చెప్పారు. డీహైడ్రేషన్​ వల్లే బాధితులు ఇలా ప్రవరిస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారనే విషయాన్నే వీరు చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు శ్యాంపిల్స్​తీసుకున్న రిజల్ట్​ఎప్పుడొస్తుందనే దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

దందాలో పొలిటికల్​ లీడర్లు

గతంలో దందా నిర్వహించే వ్యాపారులు పొలిటికల్​ లీడర్లకు నెలనెలా వాటాలు ఇచ్చే వారు. ప్రస్తుతం వ్యాపారులే లీడర్లుగా చలామణి అవుతుండటంతో సమస్య వచ్చినప్పుడల్లా వారి పలుకుబడి ఉపయోగిస్తున్నారు. పోలీస్, ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్ ను వారి జోలికి రాకుండా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హయ్యర్​ అఫీషియల్స్, పొలిటికల్ లీడర్ల నుంచి దాడులు చేయొద్దనే ఒత్తిళ్లు వస్తుండటంతో ఆఫీసర్లు సైతం మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కొత్తగా ఎవరూ అడ్మిట్​కాలేదు..

అస్వస్థతకు గురైన వారికి జీజీహెచ్​లో మెరుగైన ట్రీట్​మెంట్ అందిస్తున్నాం. ప్రస్తుతం హాస్పిటల్​లో అడ్మిట్ అయిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మంగళ, బుధవారాల్లో కొత్తగా ఈ సింటమ్స్​ తో ఎవరూ అడ్మిట్ కాలేదు.

- రాంకిషన్, జనరల్​హాస్పిటల్​సూపరింటెండెంట్, మహబూబ్​నగర్​