రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 కిలోమీటర్లకు పైగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కరిసే అవకాశం ఉందన్నారు.
మరోవైపు హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. సిటీ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. సౌత్ హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. మరో రెండు గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అయితే LB నగర్, హయత్ నగర్, బండ్లగూడ, బహదూర్ పురలో భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు. అక్కడి ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
10 నుంచి 12 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటికి రావాలని పిలుపునిచ్చారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉందన్న ట్రాఫిక్ పోలీసులు.. అవసరముంటేనే వాహనదారులు బయటకు రావాలని ఆదేశించారు. రాష్ట్రానికి ఇవాళ, రేపు భారీ వర్ష సూచన చేసింది IMD. ఇక రాష్ట్రం ఎల్లో అలర్ట్ కేటగిరీలో ఉంది.