- ఫేక్ గోల్డ్ బిస్కెట్స్ తో గోల్ మాల్
- నలుగురు నిందితులు అరెస్ట్
హైదరాబాద్,వెలుగు: ఇంటి భూమిలో బంగారం ఉందని చెప్పి పూజలు చేయించి ఫేక్ గోల్డ్ బిస్కట్స్తో మోసాలు చేస్తున్న గ్యాంగ్ కి చెందిన నలుగురిని గురువారం శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓల్డ్ సిటీ మీర్ అలం మండికి చెందిన మీర్జా అబ్బాస్ అలీ సజ్జాద్(46) తల్లి కొన్ని రోజుల క్రితం చనిపోయింది. పీడకలలు, అనారోగ్యం కారణంగా తన తల్లి మృతి చెందినట్లు సజ్జాద్ ఫ్రెండ్ అలీ అక్బర్ తయ్యబి(50)తో చెప్పాడు. వీరిద్దరూ కలిసి యాకత్పురాకు చెందిన అబ్దుల్ ఫహీమ్(48),చార్మినార్కి చెందిన షేక్ హఫీజ్(46)తో కలిసి ఆమె మృతికి గల కారణాలపై డిస్కస్ చేశారు. ఓల్డ్ మల్లెపల్లికి చెందిన ఆర్ఎంపీ దస్తగిరి అహ్మద్(65) బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసాలు చేసేవాడు. దోషాల నివారణకు పూజలు చేయడం, తాయత్తులు కట్టడం చేసేవాడు. ఫహీమ్ కు దస్తగిరి పరిచయం ఉండటంతో సజ్జాద్, అక్బర్ తయ్యబి, ఫహీమ్, షేక్ హఫీజ్ ను అతడి దగ్గరికి తీసుకెళ్లాడు. సజ్జాద్ తల్లి మృతి గురించి తెలుసుకున్న దస్తగిరి సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు. అతడి ఇంటికి వెళ్లి పరిశీలించాడు. ఇంటి భూమి లోపల బంగారం ఉండటం వల్లే సజ్జాద్ తల్లికి పీడకలలు వచ్చి ఆమె చనిపోయిందని దస్తగిరి చెప్పాడు. భూమిలో ఉన్న బంగారాన్ని ప్రత్యేక పూజలతో బయటికి తీయాలన్నాడు.
పూజ కోసం రూ.3 లక్షలు
పూజ చేసేందుకు రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలు ఖర్చు అవుతుందని దస్తగిరి చెప్పాడు. దీంతో ముందుగా రూ.3 లక్షలు ఇచ్చేందుకు సజ్జాద్ ఒప్పుకున్నాడు. పూజ చేసిన తర్వాత మిగతా డబ్బు ఇస్తానన్నాడు. సజ్జాద్ ఇంట్లో పూజలు చేసేందుకు దస్తగిరి టైమ్ ఫిక్స్ చేశాడు. స్కెచ్లో భాగంగా అబ్దుల్ ఫహీంతో కలిసి గోల్డ్ కోటెడ్ బిస్కెట్స్ను తెప్పించాడు. పూజల పేరుతో సజ్జాద్, అతని ఫ్యామిలీ మెంబర్స్ దృష్టి మళ్ళించాడు. 5 గుంతలు తీసి గోల్డ్ కోటెడ్ బిస్కెట్స్ ను పాతిపెట్టాడు. పూజలు చేస్తున్నట్లు యాక్ట్ చేసి ఓ గుంతలోని గోల్డ్ కోటేడ్ బిస్కెట్ను బయటికి తీశాడు. దానికి క్లాత్ చుట్టి సజ్జాద్ కి ఇచ్చాడు. 4 గంటల తర్వాత క్లాత్ ఓపెన్ చేయాలని చెప్పాడు. లేకపోతే బిస్కెట్ పవర్స్ పోతాయని.. ఇంట్లో ప్రాణనష్టం జరుగుతుందని సజ్జాద్ను దస్తగిరి భయపెట్టాడు. 4 గంటల తర్వాత సజ్జాద్ క్లాత్ ఓపెన్ చేసి చూశాడు. దస్తగిరి ఫేక్ గోల్డ్ బిస్కెట్ ఇచ్చినట్టు గుర్తించాడు.
ఇతరులను మోసం చేసేందుకు సజ్జాద్ స్కెచ్
దస్తగిరి చేతిలో మోసపోయిన సజ్జాద్ కూడా ఫేక్ గోల్డ్ బిస్కెట్స్తో మోసాలకు స్కెచ్ వేశాడు. తన ఫ్రెండ్ అలీ అక్బర్ తయ్యబితో కలిసి 11 గోల్డ్ కోటెడ్ బిస్కెట్స్ ను తయారు చేయించాడు. తమ వద్ద గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయని ఫ్రెండ్స్, బంధువులకు చెప్పాడు. తక్కువ ధరకు వాటిని అమ్ముతామని ప్రచారం చేశాడు. ముబీన్ అనే వ్యక్తిని ట్రాప్ చేసి 20 తులాల బరువు గల గోల్డ్ బిస్కెట్ రూ.40 వేలకు అమ్ముతున్నామని చెప్పారు. కొన్ని గోల్డ్ బిస్కెట్స్ కావాలని చెప్పి ముబీన్ రూ.50 వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. గోల్డ్ బిస్కెట్ను చెక్ చేసుకున్న ముబీన్ అది ఫేక్గా గుర్తించాడు. శంషాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులు దస్తగిరి, హఫీజ్, తయ్యబితో పాటు సజ్జాద్ను సైతం అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.