- మల్టీలెవెల్ మార్కెటింగ్, చైన్ సిస్టమ్,
- సైబర్ నేరాల్లో రూ.కోట్లు కొట్టేస్తున్న క్రిమినల్స్
హైదరాబాద్,వెలుగు: వైట్ కాలర్ అఫెన్స్, సైబర్ క్రైమ్ కేసులు పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి. దేశాలు దాటుతున్న డబ్బు రికవరీ కష్టంగా మారింది. ఫేక్ అకౌంట్స్లో డిపాజిట్స్ పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రాపర్టీ రికవరీ క్వశ్చన్ మార్క్గా నిలిచిపోతోంది. ప్రతీ ఏటా మల్టీలెవెల్ మార్కెటింగ్, లాటరీ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్ మెంట్స్, చైన్ సిస్టమ్ స్కామ్స్ లో నిందితులు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఈ నెల 8న ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ గ్యాంగ్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు, చైనా దేశస్థుల ఆపరేషన్స్ తో నడిచిన ఈ స్కామ్ లో 9 నెలల్లో నిందితులు రూ.50 కోట్లకుపైగా కొట్టేశారు. కానీ పోలీసులు ఈ కేసులో రూ.3 కోట్లను మాత్రమే సీజ్ చేశారు.
ప్రతి ఏడాది రూ.450 కోట్ల దందా
ఆన్లైన్ ఫ్రాడ్స్ లో ప్రతి ఏడాది సుమారు రూ.450 కోట్లు సైబర్ క్రిమినల్స్ అకౌంట్స్ లోకి వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కామర్స్ సైట్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై మల్టీలెవెల్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. సైబర్ క్రిమినల్స్ అట్రాక్ట్ చేసే ఆఫర్లతో ట్రాప్ చేస్తున్నారు. రూ.30 నుంచి రూ.30 వేల పెట్టుబడి పేరుతో చైన్ సిస్టమ్ దందా చేస్తున్నారు. కమిషన్స్,గిఫ్ట్ కూపన్స్ ఆశచూపి మెంబర్స్ని కలెక్ట్ చేస్తున్నారు. తమ డిపాజిటర్లను నమ్మించేందుకు కొంత కాలం కమీషన్స్ ఇస్తున్నారు. చైన్ మెంబర్స్ ఇంక్రీస్ అయ్యాక టార్గెట్ చేసిన వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నారు. ఫస్ట్ మెంబర్ను ఏజెంట్స్గా మార్చి అందినంత వసూలు చేస్తున్నారు.
ఫేక్ కంపెనీలు..అకౌంట్స్
ముంబయి, బెంగళూర్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ అడ్డాగా ఫేక్ కంపెనీలను క్రిమినల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫేక్ అడ్రెస్లతో ఫేక్ కంపెనీల పేర్లను రిజిస్టర్ చేయిస్తున్నారు. ఏజెంట్స్తో అడ్డాకూలీల ఆధార్ కార్డులు కలెక్ట్ చేస్తున్నారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కంపెనీలకు లింక్ చేస్తున్నారు. డిపాజిటర్లు,కస్టమర్ల నుంచి కలెక్ట్ చేసిన డబ్బును రోజర్ పే గేట్ వే, బిట్ కాయిన్స్ రూపంలో తమ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో సొమ్ము రికవరీ పోలీసులకు సవాల్గా మారింది. ఆన్ లైన్ అడ్డాగా ఈ దందాలో బాధితులు కోల్పోతున్న డబ్బులు రికవరీ కావడం అసాధ్యమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.దొంగలు దొరికినా వారి వద్ద డబ్బు రికవరీ మాత్రం కష్టమేనని చెప్తున్నారు.
ఈ బిజ్, క్యూనెట్ మోసాలు
చైన్ సిస్టమ్, చీటింగ్ కేసుల్లో క్రిమినల్స్ ఫేక్ అకౌంట్స్లోని డబ్బును దారిమళ్లించి కంపెనీల బ్యాంక్ బ్యాలెన్స్ ను జీరోగా చూపిస్తున్నారు. గతంలో గ్రేటర్ సిటీ పరిధిలో ఈ బిజ్,క్యూనెట్,హ్యప్పీ ఫ్యూచర్,షేర్డ్ బైక్ యాప్ లాంటి చైన్ సిస్టమ్ కంపెనీల్లో వందల సంఖ్యలో డిపాజిటర్లు చేరి మోసపోయారు. సైబర్ నేరాల్లో కూడా క్రిమినల్స్ పట్టుబడుతున్నా..వారు కొట్టేసిన డబ్బు మొత్తం రికవరీ కావడం లేదు. ఇలాంటి కేసుల్లో 25 శాతం డబ్బును మాత్రమే పోలీసులు రికవరీ చేయగలుగుతున్నారు.
ఆన్ లైన్ లో ఇన్వెస్ట్ చేయొద్దు
వైట్ కాలర్ క్రిమినల్స్ కొట్టేసిన సొమ్ము రికవరీ కాకుండా ప్లాన్ చేస్తారు. ఎక్కువగా జల్సాలకు ఖర్చు చేసి డబ్బులు అయిపోయిన తర్వాత వారు మళ్లీ మోసాలకు పాల్పడతారు. ఆన్ లైన్ లో ఎలాంటి ఇన్వెస్ట్ మెంట్స్ చేయొద్దు.
‑ కేపీఎం ప్రసాద్, ఏసీపీ సైబర్ క్రైమ్, సైబరాబాద్