డ్యూటీకొచ్చినా చేయడానికి పని ఉండడం లేదు

డ్యూటీకొచ్చినా చేయడానికి పని ఉండడం లేదు

రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఆఫీసుల్లో నెలరోజులుగా ఖాళీగా ఉంటున్న ఉద్యోగులు

ఎటూ తేలని వీఆర్వోల ఫ్యూచర్

ముందస్తు కసరత్తు లేకుండానే చట్టాన్ని తేవడమే కారణం

పోర్టల్ పై ఇంకా కొనసాగుతున్న కసరత్తు

హైదరాబాద్, వెలుగు:  రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు, సిబ్బంది నెల రోజులుగా రికాంగా ఉంటున్నరు. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తెస్తూనే.. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాస్​బుక్ ల జారీని ఆపేయడంతో సబ్​రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఇతర సిబ్బందికి పని లేకుండా పోయింది. రోజూ ఆఫీసుకు వెళ్లి హాజరు వేసుకుని సాయంత్రం వరకు ఉండి ఇంటి బాట పడుతున్నారు. ఎప్పుడూ విజిటర్లతో రద్దీగా ఉండే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల ఆఫీసులు ఇప్పుడు కళతప్పి కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ధరణి పోర్టల్ పై ముందస్తు కసరత్తు, ప్రణాళిక లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తేలని వీఆర్వోల ఫ్యూచర్..

వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వారు చేయాల్సిన డ్యూటీ ఏమిటో సర్కార్​ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కొందరు రెగ్యులర్​గా తహసీల్దార్​ఆఫీస్​కు వెళ్లి హాజరు వేసుకుని వస్తుండగా, మరికొందరు తహసీల్దార్లు అప్పగించిన పనులు చేస్తున్నారు. వీఆర్వోల ఉద్యోగాలు ఎటూపోవని, వారిని ఏవో కొన్ని శాఖల్లో వీలినం చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వారి డ్యూటీలపై స్పష్టమైన ఆదేశాలివ్వలేదు. దీంతో వివిధ జిల్లాల్లో పాలనాపరమైన అవసరాల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ఒక్కో విధమైన పనులు అప్పగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రైస్​మిల్స్ లో ఫిజికల్లీ సిట్టింగ్​ఆఫీసర్స్​గా, మరికొన్ని జిల్లాల్లో ఎల్ఆర్ఎస్​పనులు చేయిస్తున్నారు.

ఎడిటింగ్ ఆప్షన్ ఉంటది.. 

దసరా నాటికి ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. కానీ ఈ పోర్టల్ పూర్తిస్థాయిలో వస్తుందా? అన్నది అనుమానంగానే ఉంది. వ్యవసాయ, వ్యవసాయేతర ప్రాపర్టీల వివరాలన్నీ ధరణి పోర్టల్ లోనే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పోర్టల్ నిర్వహణ, ఆప్షన్స్ పై ప్రభుత్వం ఇంకా కసరత్తు చేస్తోంది. గతంలో ఒకసారి ధరణిలో డేటా నమోదైతే మార్చేందుకు వీలుండదని చట్టంలో పేర్కొన్న ప్రభుత్వం తాజాగా ఎడిటింగ్ ఆప్షన్ పెట్టాలని నిర్ణయించింది. దీనికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మరోవైపు వ్యవసాయేతర ఆస్తుల నమోదు10 రోజుల్లో 30% కూడా పూర్తి కాలేదు. ఇంకా70% నమోదు మిగిలే ఉండడంతో పూర్తి స్థాయి ధరణి పోర్టల్‌‌పై సందిగ్ధం నెలకొంది. దసరాకు వ్యవసాయ భూముల సమాచారంతోనే పోర్టల్ ను ప్రారంభించే చాన్స్‌‌ ఉందని తెలుస్తోంది.  తహసీల్ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఇంకాస్త సమయం పట్టొచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.