కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి

కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి

వికారాబాద్ జిల్లా :  వికారాబాద్‌ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి తండ్రి, మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (78) అంత్యక్రియల్లో అపశృతి చోటు చేసుకుంది. మొదటి రౌండ్ మిస్ ఫైర్ అయ్యింది. గాలిలోకి కాల్పులు కాల్చక ముందే గన్ పేలింది. జనంలో తుటా పేలినా ఎవరికీ ఎలాంటి అపాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి.. ఇటీవలే కోలుకుని ఇంటివద్దే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భోజనానంతరం ఇంట్లోనే కళ్లు తిరిగి కిందపడిపోయారు. కుటుంబీకులు సీపీఆర్‌ చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే అంబులెన్సులో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్ణయించింది.

కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఉపసర్పంచిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. దశాబ్దకాలం సర్పంచిగా కొనసాగారు. 1985లో పరిగి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1985 నుంచి 1987 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా, 1987 నుంచి 1989 వరకు టీటీడీ సభ్యుడిగా వ్యవహరించారు. 1997 నుంచి 2000 వరకు ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా కొనసాగారు. 2012లో బీఆర్ఎస్ లో చేరారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య గిరిజాదేవి, కుమారులు మహేష్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, కుమార్తె అర్చనారెడ్డి ఉన్నారు.