హైదరాబాద్, వెలుగు: ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ ప్రొవైడర్ అయిన థెర్మాక్స్ హైదరాబాద్లో శుక్రవారం రీడిస్కవర్ పేరుతో రోడ్షో నిర్వహించింది. పర్యావరణానికి మేలు చేసే పలు ప్రొడక్టులను ప్రదర్శించింది. వీటితో కంపెనీలు కాలుష్యాన్ని, వ్యర్థాలను తగ్గించుకొని డబ్బును కూడా ఆదా చేయవచ్చని ప్రకటించింది. వ్యర్థాలను శక్తిగా మార్చే బయోమాస్, హైబ్రిడ్ రెన్యువబుల్, బయో -సీఎన్జీ, ఎలక్ట్రికల్/హైబ్రిడ్ హీటింగ్, కూలింగ్ సొల్యూషన్స్, గ్రీన్ హైడ్రోజన్ ఇంధన ఆధారిత పరిష్కారాలు ఇందులో ఉన్నాయి.
ఈ సందర్భంగా సంస్థ సీఈఓ ఆశిష్ భండారి మాట్లాడుతూ, “కరెంటును, శక్తి, నీటిని తక్కువగా ఉపయోగించుకునేలా చేసే వందలాది ప్రొడక్టులు మా దగ్గర ఉన్నాయి. తెలంగాణలో మాకు వందలాది మంది కస్టమర్లు ఉన్నారు. థెర్మాక్స్ కస్టమర్లు ముందస్తు కాపెక్స్ పెట్టుబడి, ఒపెక్స్, లేదా బిల్డ్-ఓన్-ఆపరేట్ (బీఓఓ) ద్వారా మా సేవలను పొందవచ్చు. మాకు దేశవిదేశాల్లో 19 ప్లాంట్లు ఉన్నాయి. చెన్నై, ఏపీలోనూ ప్లాంటు ఉన్నాయి. మేం ఫుడ్, ఫార్మా, కెమికల్స్, టెక్స్టైల్స్ వంటి సెక్టార్లకు ఎక్కువగా సేవలు అందిస్తాం”అని ఆయన వివరించారు.